రంగారెడ్డి, జనవరి 11(నమస్తే తెలంగాణ): బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే జిల్లాలో ముగిసింది. గత డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ మేరకు 515 మంది బాలబాలికలు బడికి దూరంగా ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. వీరిని వచ్చే విద్యాసంవత్సరం సమీపంలోని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికోసం వర్క్సైట్ పాఠశాలల ఏర్పాటుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నది.
వివిధ కారణాలతో చాలా మంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. కొందరు బడి ముఖం అసలే ఎరుగక పోగా.. మరికొందరు మధ్యలో చదువును మానేస్తున్నారు. వివిధ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీరంతా తిరిగి బడి బాట పట్టేలా విద్యాశాఖ ప్రతి సంవత్సరం బడి బయట పిల్లల గుర్తింపు కోసం సర్వే నిర్వహిస్తున్నది. ఈ ఏడాది కూడా సీఆర్పీలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటా తిరిగి సర్వే నిర్వహించారు. పరిశ్రమలు, పని ప్రదేశాలు, దుకాణాల వద్ద సర్వే చేపట్టి బడికి దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించారు.
6 నుంచి 14 సంవత్సరాల లోపు 274 మంది బడీడు పిల్లలు, 15 నుంచి 19 సంవత్సరాల లోపు 84 మందిని కళాశాల స్థాయిలో పిల్లలను వేర్వేరుగా గుర్తించారు. ఇతర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన కుటుంబాలకు చెందిన 157 మంది పిల్లలను సైతం గుర్తించి జాబితాలను వేర్వేరుగా రూపొందించారు. గుర్తించిన పిల్లలను వచ్చే విద్యాసంవత్సరం సమీప పాఠశాలల్లో చేర్పించనున్నారు. కళాశాల స్థాయి విద్యార్థులకు విద్య వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసి ఓపెన్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా చదువుకునే విధంగా ప్రోత్సహించనున్నారు. సర్వే వివరాలను జాతీయ స్థాయిలో రూపొందించిన ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు.
ప్రతి సంవత్సరం ఇటుక బట్టీల నిర్వహణకు ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు చాలామంది కార్మికులు వస్తుంటారు. అలాగే విగ్రహాల తయారీ పరిశ్రమలు, క్వారీల్లో ఇతర రాష్ర్టాల వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ తరహా కార్మికులకు సంబంధించిన పిల్లల చదువు కోసం పని ప్రదేశంలోనే పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకోనున్నది. పిల్లల మాతృభాష తెలిసిన ఒక వలంటీర్ను నియమించి విద్యాబోధన జరుపుతారు. సంబంధిత వలంటీర్కు ఆయా యజమానులే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. వర్క్సైట్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.