అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నామినేషన్ల స్వీకరణకుగాను ఆర్వో కార్యాలయాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని, అంతకు మించి ఖర్చు చేస్తే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.
ఇప్పటివరకు రూ.1.99 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లాలో 9,49,365 ఓటర్లుండగా.. 1133 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
-వికారాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయ్యింది. ఈనెల 10 వరకు నామినేషన్ల దాఖలుకుగాను ఎన్నికల సంఘం గడువిచ్చింది. అయితే జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఆర్వో కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారన్నారు. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకుగాను ఆర్వో కార్యాలయాల్లో సిబ్బంది, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలతోపాటు ఫారం-30 పత్రాలను అభ్యర్థులు తీసుకోవచ్చన్నారు. అదేవిధంగా షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టికల్ స్కాడ్ బృందాలు, వీడియో చిత్రీకరణ బృందాలు నాలుగు నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాయన్నారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఎన్నికల వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని, ఇకపై ఎన్నికలకు సంబంధించి వ్యయ వ్యవహరాలన్నింటిని పరిశీలకుల ఆధ్వర్యంలో జరుగనుందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పార్టీల ఖాతాల్లో ఎన్నికల ఖర్చును జమ చేశామని, నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం అభ్యర్థుల ఖాతాల్లో ఎన్నికల ఖర్చును జమ చేస్తామన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో రూ.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని, అంతకు మించి ఖర్చు చేస్తే సంబంధిత అభ్యర్థులను పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించారు.
జిల్లాలోని సరిపోను ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు-125 శాతం, వీవీ ప్యాట్లు-140 శాతం ఉన్నాయని, ఇప్పటికే ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో భద్రపర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 9,49,365 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు-4,22,159 మంది ఓటర్లు, మహిళలు-4,77,167 మంది ఓటర్లు, ఇతరులు-37 ఉన్నారన్నారు. అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకున్న ఫారం-6, 8 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈనెల 10 వరకు పూర్తి చేసి, అదేరోజు సాయంత్రం ఓటరు తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.
మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి దివ్యాంగులు, 80 ఏండ్లుపైబడిన వారు ఫారం-12(డి)ని పూర్తి చేసి ఈనెల 8లోగా ఆర్వోలకు అందజేయాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు కూడా పోస్టల్ బ్యాలెట్లను అందజేశామని, గతంలో మాదిరిగా పోస్టల్ బ్యాలెట్లను ఇంటికి తీసుకెళ్లేందుకు వీలులేదని, వెంటనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సద్వినియోగం చేసుకొని బాక్సులో వేయాలని తెలిపారు. అంతేకాకుండా బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న 1133 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1.99కోట్ల నగదును సీజ్ చేశారని, సీజ్ చేసిన నగదుకు సంబంధించి బాధిత వ్యక్తులు సరైన పత్రాలు చూపించడంతో రూ.1.19 కోట్ల నగదు రిలీజ్ చేశామని, పట్టుబడిన నగదుకు సంబంధించి ఆధారాలుంటే 24 గంటల్లోగా రిలీజ్ చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ర్యాలీలు, సమావేశాలను నిర్వహించేందుకుగాను అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, అనుమతి లేకుండా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
జిల్లాలోని నాలుగు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద నామినేషన్ల సందర్భంగా డీఎస్పీ స్థాయి అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 15 చెక్పోస్టుల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో నిఘా పెట్టామని, వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చాయని, మరో 3 కంపెనీల బలగాలు రావాల్సి ఉందని ఎస్పీ వెల్లడించారు.