ఇబ్రహీంపట్నం రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాల కోసం అందు బాటులోకి తీసుకొచ్చిన పశుసంచార వాహనాలు మూగజీవాల పాలిట వరంగా మారింది. 108 తర హాలో ప్రభుత్వం మూగజీవాలకు సత్వర సేవలు అందించేందుకు 1962 నంబర్ను అందుబాటులోకి తీసుకురావడంతో నేడు మారుమూల గ్రామాల్లో సైతం మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందుతున్నాయి. మూగజీవాలను రక్షించేందుకు ముఖ్యమంత్రి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.
గతంలో మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరిగినా పశువైద్యశాలకు తీసుకువచ్చేలోపే మూగజీవాలకు మృత్యువాతకు గురయ్యేవని దీంతో పాడిరైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార వాహనం ద్వారా ఎలాంటి నష్టాలుండవని రైతులు అంటున్నారు. మూగజీవాలకు ఎలాంటి ప్రమాదమున్నా, అలాగే, డెలవరీ సమయంలో ఇబ్బంది ఉన్నా వెంటనే రైతులు 1962 వాహనాల కు కాల్ చేసిన క్షణాల్లోనే వాహనాలు సంఘటన స్థలాలకు చేరుకుని చికిత్సలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు అందిస్తున్న తరహాలోనే మూగజీవాలకు కూడా వైద్యం అందించడం సంతోషించదగ్గ విషయమని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది.
35వేల మూగజీవాలకు వైద్యం
ఈ సంవత్సరం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పశుసంచార వాహనాల ద్వారా 35వేల మూగ జీవాలకు సిబ్బంది చికిత్సలు అందించినట్లు జిల్లా అధికారి రమేశ్ తెలిపారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రమాదాల్లో ఉన్న మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వైద్యసేవలు అందించి మూగజీవాలను కాపాడగలిగామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా క్షణాల్లో చేరుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.