ఇప్పటికే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరో ఘనత దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు రైలు కోచ్ ఫ్యాక్టరీ శంకర్పల్లి మండలంలోని కొండకల్లో ఏర్పాటుకాగా, గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రూ.1000కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 2,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదివరకే వేల పరిశ్రమలు కొలువుదీరగా మన జిల్లా పారిశ్రామిక హబ్గా వెలుగొందుతున్నది. పెద్ద పెద్ద కంపెనీల ఏర్పాటుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గత తొమ్మిదేండ్లలో జిల్లావ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు కలుపుకొని మొత్తం 1,252 వరకు ఉండగా.. రూ.47,062కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగా 5,15,851 మంది ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. కాగా, నేడు సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రంగారెడ్డి, జూన్ 21(నమస్తే తెలంగాణ): ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఇవి తెలంగాణ ఉద్యమ నినాదాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వరాష్ట్రంలో ఇవన్నీ ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖజానాగా నిలవగా.. నలు చెరుగులా ఏర్పాటవుతున్న పరిశ్రమలతో పారిశ్రామిక ప్రగతి నేడు అందరి కండ్లముందు కనబడుతున్నది. యువతకు ఉపాధి అవకాశాలను సైతం కల్పించి..స్థానికులకు ఉపాధి కల్పన కాదు.. నిజమని తెలంగాణ ప్రభుత్వం నిరూపితం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు 1,252 వరకు ఉండగా..రూ.47,062కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగా 5,15,851 మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిసంఖ్య ఇంతకు రెట్టింపుగానే ఉంటుంది. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు సైతం ఉపాధి పొందుతుండగా.. పారిశ్రామిక వేత్తలు స్థానికులకే అధిక ప్రాధాన్యతనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఫాక్స్కాన్ వంటి ప్రముఖ సంస్థల రాకతో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరిగాయి. కొండకల్లో రూ.1000కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా 2,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.’
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ఐపాస్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను సృష్టిస్తోంది. అన్నీ సజావుగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులొచ్చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడడం.. శాంతిభద్రతల సమస్యలు లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు గ్రామీణ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల పరంగా రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచింది.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరీశ్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని కొండకల్కు గురువారం సీఎం కేసీఆర్ వస్తున్నారు. ఇక్కడ రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టిన రైలు కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ హరీశ్ పరిశీలించారు.