రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో 1,890 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా, రంగారెడ్డి జిల్లాలో 9,186మంది ఉద్యోగులు ఓటు వేయనున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించిన సిబ్బంది… బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలీసు సిబ్బందిని ఇప్పటికే కేటాయించారు.
వికారాబాద్, మార్చి 12, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్కు జిల్లావ్యాప్తంగా 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్కో బ్యాలెట్ బాక్సును చేరవేశారు. ఆదివారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించిన సిబ్బందితోపాటు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన తాగునీరు, లైటింగ్, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలను కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, మైక్రో అబ్జర్వర్ల ఇద్దరు చొప్పున 18 పోలింగ్ కేంద్రాల్లో 108 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు ఐదుగురు సెక్టోరియల్ అధికారులు, ఐదుగురు రూట్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలీసు సిబ్బందిని ఇప్పటికే కేటాయించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 1890 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు-1232, మహిళలు-658 ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు-1740, ప్రైవేట్ టీచర్లు-150 మంది ఉన్నారు. తాండూరు డివిజన్లో 678 మంది ఓటర్లుండగా, వికారాబాద్ డివిజన్లో 1212 మంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈమేరకు ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఇప్పటికే కలెక్టర్ నేతృత్వంలో పోలీసులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 9,186మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 9,186 మంది ఓటర్లకుగాను.. పురుషులు-4,870., స్త్రీలు 4,317., ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, పటిష్ట బందోబస్తు, వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.
ఆమనగల్లు : ఎమ్మెల్సీ ఎన్నిక సోమవారం జరుగనుండడంతో ఆమనగల్లులోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పోలింగ్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. సెక్టోరియల్ అఫీసర్ వెంకటరామ్ పోలింగ్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల ఆర్ఐలు చెన్నకేశవులు, రాకేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
బొంరాస్పేట : మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఆదివారం పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్ఐ రవిచారి పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లలో సహకరించారు. మండలంలో 18 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంది.
మర్పల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీధర్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ అధికారులు, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మండలంలో 21 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మాధవరెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
వికారాబాద్ : వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్వో అశోక్కుమార్, సంబంధిత అధికారులు ఆదివారం పోలింగ్ కేంద్రాల సిబ్బందిని ఎంపిక చేశారు. పోలింగ్ సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది బయలుదేరారు. కేంద్రాలకు వెళ్లేందుకు అధికారులు, సిబ్బందికి తగు వాహనాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద దింపారు. వీరికి బందోబస్తుగా పోలీసులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వికారాబాద్ సీఐ శ్రీను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ప్రజలు ఎవరూ తిరగవద్దన్నారు. ప్రజలు, నేతలు పోలీసులకు సహకరించాలని కోరారు.
పెద్దేముల్ : ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఎస్ఐతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికను పీవో ధనుంజయ సమక్షంలో ఎన్నికను నిర్వహిస్తామని.. ఓటర్లు సహకరించాలని కోరారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎస్ఐ అన్వేశ్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కేంద్రంలో ఓటర్లు 23 మంది ఉన్నారని తెలిపారు.
కొడంగల్ : ఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయినట్లు పీవో నర్సింహారెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, బొంరాస్పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దౌల్తాబాద్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. కొడంగల్లో 80, బొంరాస్పేటలో 18, దౌల్తాబాద్లో 27 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 5 మంది పోలింగ్ సిబ్బంది, భద్రతాపరంగా 5 మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు.
కులకచర్ల : ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కులకచర్ల తహసీల్దార్ రమేశ్కుమార్ తెలిపారు. మండలంలో 82 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు.
తాండూరు, మార్చి 12 : నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో 572 మంది ఓటట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 438, యాలాల జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో 81, బషీరాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో 30, పెద్దేముల్ జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో 23 ఓట్లు ఉన్నట్లు పోలింగ్ బూత్ అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అందరూ సహకరించాలని తాండూరు డీఎస్పీ శేఖర్గౌడ్ కోరారు.