సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు. హైదరాబాద్ నగరంలోకి డ్రగ్స్ రాకుండే ఉండేందుకు హెచ్న్యూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా చేసే వారిని, వినియోగదారులను గుర్తించి ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ స్మగ్లర్లు కొన్నేండ్లుగా గోవాలోనే తమ దందాను నిర్వహించారు. అక్కడే ఏజెంట్లను నియమించుకొని పలు రాష్ర్టాలకు డ్రగ్స్ సరఫరా చేశారు. గోవా నెట్వర్క్ను గుర్తించిన హెచ్న్యూ పోలీసులు.. పక్కా సమాచారంతో ఆ ముఠాలను అరెస్టు చేశారు. దీంతో గోవా నుంచి డ్రగ్స్ రావడం తగ్గిపోయింది. అయితే, ప్రస్తుతం ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందాను నిర్వహించే స్మగ్లర్లు కొందరు వారివద్ద పనిచేసే ఏజెంట్లను హైదరాబాద్కు పంపిస్తున్నారు. వారి ద్వారా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. వీరిపై కూడా నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిచ్చిన సమాచారంతో మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
నైజీరియాకు చెందిన ఓజోనగ్వ ఎమ్మాన్యుల్ ఓసోండు 2016లో స్టూడెంట్ వీసాపై భారత్కు వచ్చి, ముంబైలో ఉన్నాడు. డ్రగ్ డీలర్ నెవల్ అరుమ్ వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేసి.. స్థానికంగా అవసరం ఉన్న వ్యక్తులకు విక్రయించాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చిన అతడు ఐదు గ్రాముల కొకైన్తో పోలీసులకు పట్టుబడ్డాడు.
యూసుఫ్గూడలోని మధురానగర్కు చెందిన భరత్ థుక్రాల్కు ముంబైకి చెందిన ప్రధాన డ్రగ్ స్మగ్లర్తో పరిచయం ఉంది. ముంబైలో డ్రగ్స్ కొనుగులు చేస్తున్న భరత్.. హైదరాబాద్కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ముంబై లింక్లను గుర్తించిన హెచ్న్యూ పోలీసులు తాజాగా భరత్ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.