రంగారెడ్డి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నన్ ఆఫ్ ది ఎబో(నోటా)ను ప్రతి ఈవీఎంలో చివరన అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో 14,874 మంది ‘నోటా’కు జై కొట్టారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3,145 మంది నోటా ఆప్షన్ను ఎంచుకుంటే.. అత్యల్పంగా కల్వకుర్తిలో 661 మంది నోటా వైపు మొగ్గు చూపారు.
గత ఎన్నికలతో పోలిస్తే నోటాను ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో నోటాకు వచ్చిన ఓట్లను నియోజవర్గాల వారీగా పరిశీలిస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1,427, చేవెళ్ల 1,423, కల్వకుర్తి 661, ఎల్బీనగర్ 2,966, మహేశ్వరం 2,031, రాజేంద్రనగర్ 1,832, షాద్నగర్ 1,389, శేరిలింగంపల్లిలో 3,145 ఓట్లు పోల్ అయ్యాయి.