ఆకుపచ్చ తెలంగాణగా మార్చి కరువుకాటకాలను దూరం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏటేటా దిగ్విజయంగా సాగుతున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడాది వారం, పది రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి, 40.49 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లాయంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ గ్రామంలోనే మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మొక్కలు, 4 మున్సిపాలిటీల పరిధిల్లో 2.15 లక్షల మొక్కలను నాటేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేకాకుండా శాఖల వారీగా ఎన్ని మొక్కలను నాటాలో జిల్లా ఉన్నతాధికారులు టార్గెట్లను నిర్దేశించారు. ఈ ఏడాది పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. గతేడాది 40.49 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 38.70 లక్షల మొక్కలను నాటినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
– వికారాబాద్, జూలై 12, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. వర్షాలు కురుస్తుండడంతో వారం, పది రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేందుకు నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధంగా ఉంచారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను జిల్లా ఉన్నతాధికారులు నిర్దేశించారు. మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ ఏడాది అడవుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు జిల్లాలోని ఆయా అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది నాటిన మొక్కల్లో 70 శాతం మేర మొక్కలు బతకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు కూడా చర్యలు చేపట్టారు.
560 నర్సరీల్లో మొక్కలు సిద్ధం
ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లోని మొక్కలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే నాటనున్నారు, ఏదేని నర్సరీలో తక్కువ మొక్కలున్నట్లయితే పక్క గ్రామపంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 40.49 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 38.70 లక్షల మొక్కలను నాటినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 40.49 లక్షల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మొక్కలు, మున్సిపాలిటీల పరిధిలో 2.15 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.