బొంరాస్పేట, జూన్ 2: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. జూన్ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకో కార్యక్రమంతో ఉపాధ్యాయులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలువనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభు త్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, ఉచిత నాణ్యమైన విద్య తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ మధ్యలో చదువు మానేసిన వారిని, బాల కార్మికులను, బడిఈడు ఉన్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయనున్నారు. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచాలన్న లక్ష్యంతో విద్యాశాఖ 15 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని మండలాల ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నది. సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించడానికి గత ఏడాది మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టి దశల వారిగా పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నది. ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన కారణంగా విద్యార్థులు అటువైపే వెళ్తున్నారని భావించిన ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి అమలు చేయగా ఈ ఏడాది 9 వతరగతికి కూడా ఇంగ్లిష్ మీడియంను విస్తరించింది. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను అందజేయడానికి గత ఏడాది నుంచే ప్రణాళిక రూ పొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే మధ్యా హ్న భోజనం పథకం అమలు చేస్తుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించడానికి ప్రణాళికలు రూపొందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా గత విద్యా సంవత్సరంలో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయగా ఈ ఏడాది నుంచి అభ్యసనాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. బడిబాటలో ఉపాధ్యాయులు వీటన్నింటిని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించి ప్రవేశాలు పెంచడానికి కృషి చేయనున్నారు.
విజయవంతం చేయాలి
ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్ర మాన్ని విజయ వంతంగా నిర్వహించాలి. ఎన్రో ల్మెంట్ డ్రైవ్పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి. బడిఈడు పిల్లలను, బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అంగన్వాడీ నుంచి వచ్చే వారిని 1వ తరగతిలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించే విధంగా చూడాలి. పాఠ్య పుస్తకాలు 80 శాతం వచ్చాయి. రెండు జతల యూనిఫాంను కూడా విద్యార్థులకు అందజేయడానికి కృషి చేస్తున్నాం.
– రేణుకాదేవి,డీఈవో.వికారాబాద్