బొంరాస్పేట, జూన్ 7 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారని, వారి ఆకలి తీర్చడానికి, డ్రాపౌట్స్ నివారించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్నేండ్ల నుంచి అమలు చేస్తున్నది. మధ్యాహ్న భోజన పథకంలో అందించే ఆహారాన్ని మరింత పోషక విలువలతో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త మెనూను అమలు చేయాలని నిర్ణయించింది. కొత్త మెనూలో వెజ్ బిర్యానీని, కిచిడీని చేర్చారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ నెల 12నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా ఆ రోజు నుంచే కొత్త మెనూ అమలు కానున్నది. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో సుమారు 83 వేలకుపైగా విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థి ఒకరికి రూ.5.45లు, 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థికి రూ.8.17ల చొప్పున కూరగాయలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
సోమవారం కిచిడీ, మిశ్రమ కూరగాయల కూర, కోడిగుడ్డు. మంగళవారం అన్నం, సాంబారు, మిశ్రమ కూరగాయల కూర. బుధవారం అన్నం, ఆకుకూర పప్పు, మిశ్రమ కూరగాయల కూర, కోడిగుడ్డు. గురువారం వెజిటబుల్ బిర్యానీ, మిశ్రమ కూరగాయల కూర. శుక్రవారం అన్నం, సాంబారు, మిశ్రమ కూరగాయల కూర, కోడిగుడ్డు. శనివారం అన్నం, ఆకుకూర పప్పు, మిశ్రమ కూరగాయలతో వండిన కూరలను వడ్డిస్తారు. మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం కొత్తగా విద్యార్థులకు అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం పాఠశాలలకు వచ్చే కొంతమంది విద్యార్థులు ఇంటి వద్ద అల్పాహారం తీసుకోకుండానే వస్తుంటారు. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఖాళీ కడుపుతో పస్తులు ఉండాల్సి వస్తున్నది. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని భావించిన ప్రభుత్వం విద్యార్థులకు రోజూ ఉదయం రాగిజావను అల్పాహారంగా అందించాలని నిర్ణయించింది. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో దీనిని ప్రారంభించి ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తారు. అల్పాహారం పథకం కూడా ప్రారంభమైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పోషకాలతో కూడిన భోజనంతో పాటు అల్పాహారం అందనుంది. పోషక విలువలతో కూడిన ఆహారం అందడం వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలోని 745 ప్రాథమిక పాఠశాలలు, 116 యూపీఎస్లు, 175 ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. వీటిలో 154 పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు పథకాన్ని అమలు చేస్తుండగా, మిగిలిన 882 పాఠశాలల్లో ఎస్ఎంసీలు నియమించిన మధ్యాహ్న భోజన ఏజన్సీలు విద్యార్థులకు అన్నం వండి పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు వల్ల 83 వేలకుపైగా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ ఈ నెల 12 నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం. దీనికోసం టెండరు వేయాలి. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే టెండరు పిలుస్తాం. మధ్యాహ్న భోజనంతో పాటు ఈ నెల 20 నుంచి అల్పాహారంగా రాగిజావ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట కొన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం.
– రేణుకాదేవి, డీఈవో వికారాబాద్