పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు గిరిజన తండాల్లో ఏ వీధిని చూసినా సరైన రోడ్లు లేకపోయేవి. రోడ్లపైనే మురుగు, చెత్తాచెదారం నిండి దర్శనమిచ్చేవి. దీంతో నిత్యం దోమలు, ఈగలతో ప్రజలు సతమతమయ్యేవారు. కాని నేడు తండాల అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలు కేటాయించడంతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలతో పట్టణాలను తలదన్నే రీతిలో తండాల రూపురేఖలు మారాయి.
మంచాల మండలంలో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన కొర్రవానితండా, సత్యంతండా, ఆంబోతుతండా, పటేల్చెర్వుతండాల గ్రామపంచాయతీలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. తండాల్లో ప్రతి రోజూ ఉదయాన్నే ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించడంతోపాటు తండాల్లో హరితహరంలో భాగంగా నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం ప్రతి రోజూ మొక్కలకు సిబ్బంది నీరు పోస్తున్నారు. ప్రతి రోజూ ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా అందిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలకు నేరుగా నిధులు కేటాయించడంతో సమస్యలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరిస్తూ తీర్చిదిద్దుతున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు
గిరిజన తండాల్లో హరితహరంలో నాటిన మొక్కలను సంరక్షించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నీటిని పెడుతున్నారు. మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ చాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నారు. సర్పంచ్లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు వందకు వంద శాతం ఇంటిపన్ను వసూలు చేసి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నారు.
సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం
– సర్పంచ్ లక్ష్మి, కొర్రవాని తండా
గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను ముందుగానే గుర్తించి గ్రామపంచాయతీ సభ్యుల ఆమోదం మేరకు పనిచేస్తున్నాం. తండాల్లో గతంలో రోడ్లు, మురికి కాల్వలు లేక గిరిజనులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రతి వీధిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధిదీపాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో సమస్యలు పరిష్కరించుకొని ఇతర గ్రామాలకాదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నాం.
నిధులు కేటాయించడం సంతోషం
– రాజూనాయక్, సర్పంచ్, పీసీతండా
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడమే కాకుండా తండాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంతో రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో నూతన భవనాల నిర్మాణం కోసం రూ.25 లక్షలు కేటాయించడంతో గ్రామపంచాయతీ భవనాల పనులు పూర్తయ్యాయి.