రంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్యసంపద గణనీయం గా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. గతంలో చేపల కోసం ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలపై ఆధారపడే వారిమని.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చెరువులు, కుంటల్లో పూడికలు తీయించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో నేడు మన చెరువుల్లోనే చేప లు పుష్కలంగా లభిస్తున్నాయని తెలిపారు.
‘మిషన్ కాకతీయ’ ద్వారా రాష్ట్రంలో 27 వేల పై చిలు కు చెరువుల్లో మూడేండ్లకాలంలో రూ.పది వేల కో ట్లు వెచ్చించి పూడికతీత పనులు చేపట్టగా సత్ఫలితా లు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భూగర్భజలాలు భారీగా పెరిగి 5మీటర్ల పైకి నీరు వచ్చిందని తెలిపారు. గంగపుత్రులు, మత్స్యకారులు, ముదిరాజ్ కులస్తులకోసం జిల్లాలో 2016-17లో 45 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలితే నేడు 765 చెరువుల్లో చేప పిల్లలు, రొయ్యలను వదులుతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెరువులో రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నదని.. నాడు ఈ చెరువులో నీటి కోసం యజ్ఞాలు చేసే వారని, కృష్ణా నీటితో నింపాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యం..
సీఎం కేసీఆర్ చొరవతో ప్రతి ఏటా ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుండటంతో రాష్ట్రంలో గణనీయంగా మత్స్య సంపద పెరిగిందన్నారు. అంతేకాకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు 75% సబ్సిడీతో రూ.900 కోట్లతో వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. మత్స్యకారులు చెరువుల్లోని చేపలను విక్రయించి ప్రతి ఏటా మంచి ఆదాయాన్ని పొందుతున్నారని మంత్రి వివరించారు. గతంలో జిల్లాలో ఐదు వేల టన్నుల మత్స్యసంపద ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం తొమ్మిది వేల టన్నులకు చేరిందని.. దీని ద్వారా రూ.138 కోట్ల ఆదాయం మత్స్యకారుల కుటుంబాలకు సమకూరుతున్నదన్నారు. ఈ సందర్భంగా నాలుగు సొసైటీలకు చెందిన సభ్యులకు మంత్రి సబితారెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా ఫిషరీస్ విభా గం అధికారిణి సుకీర్తి, అధికారులు, మత్స్యకారులు, ప్రజలు పాల్గొన్నారు.
20 స్టాళ్లలో 30 రకాల వంటకాలు
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన చేపల పండుగ శనివారం వరకు కొనసాగనున్నది. 20 స్టాళ్లలో 30 రకాల వంటకాలను రుచి చూపిస్తున్నారు. ఫిష్ బిర్యానీ, పీతల ఫ్రై, ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లెట్, చేపల పులుసు, ఫిష్ రోల్, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి ఇలా దాదాపుగా 20 నుంచి 30 రకాల నోరూరించే చేపల వంటకాలను రెడీ చేసి సిద్ధంగా ఉం చుతున్నారు. అలాగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా చేపల రకాలు, ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నారు. చేపలను ఏ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఆ విభాగం అధికారులు వివరిస్తున్నారు.
30 రకాల వంటకాలను పరిచయం చేస్తారు.
జిల్లాలోని ప్రజలకు చేపలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ఈ ఫెస్టివల్ను ఏర్పాటు చేయడం సంతోషకరం. ఇక్కడ 20 స్టాళ్లలో 30 రకాల వంటకాలను రుచి చూపించడంతోపాటు ఆ వంటకాలను పరిచయం చేస్తారు. ఆసక్తి గలవారు, ఔత్సాహికులు ఈ రుచులను టేస్ట్ చేయొచ్చు.
– సుకీర్తి, మత్స్యశాఖ రంగారెడ్డి జిల్లా అధికారిణి