మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందుకు ప్రధాన ఉదాహరణ కులకచర్ల రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంస్థ. ఒకవైపు అన్నదాతలకు సాయమందిస్తూనే.. మరోవైపు ఆర్థికవృద్ధి సాధిస్తున్నది. 135 మహిళా రైతు సంఘాలు, 2025 మంది సభ్యులు కలిగిన ఈ సంస్థ కొంతకాలంగా మంచి లాభాలను ఆర్జిస్తున్నది. విత్తనాలు, ఫర్టిలైజర్స్, వేరుశనగ విత్తనాలు విక్రయించడం ద్వారా ఏటా సంస్థకు మంచి ఆదాయం వస్తున్నది. అదేవిధంగా 2019-2022 వరకు మామిడి కాయల విక్రయంతో రూ.1,48,588, 2021-2022 సంవత్సరంలో సీతాఫలాల మార్కెటింగ్తో రూ.6,23,276 లాభాలను పొందింది. అంతేకాకుండా 18 రకాల వ్యవసాయ పరికరాలను రైతులకు తక్కువ ధరకే అద్దెకిస్తూ ఏడాదికి రూ.1,31,809 లాభం పొందుతున్నది. ఈ ఏడాది చిరుధాన్యాలను పండించడంతోపాటు ప్యాకింగ్, మార్కెటింగ్ చేసేందుకు సంస్థ సభ్యులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం 250-300 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయాలని నిర్ణయించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితేనే వారి కుటుంబాలు పేదరికం నుంచి బయట పడుతాయని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆదాయాన్ని పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వ హిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్పించి సెర్ప్, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందిస్తుండటంతో వారు ఆర్థికంగా రాణిస్తున్నారు. దీంతో వారు ఆర్థిక స్వావలంబన వైపు పయనిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయగా.. ఆయా జిల్లాలోని భూములకు అనువుగా ఉండే పంటలను సాగు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించారు. మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేసే పంటల సాగు, కొనుగోలు, మార్కెటింగ్కు అయ్యే ఖర్చును ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు మెంబర్షిప్ డబ్బును వినియోగిస్తే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్ ద్వారా ఉత్పత్తిదారుల సంఘాలకు నిధులను మంజూరు చేస్తున్నది.
మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకొని పలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహిళలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు.. వ్యవసాయంపై ఆసక్తిని కలిగించేందుకు గ్రామాల్లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని 15 మంది మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేశారు. కులకచర్ల మండలంలో 135 మహిళా రైతు సంఘాలుండగా 2025 మంది సభ్యులతో కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరి ధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గత రెండేండ్లుగా చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలతో సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. సంబంధిత రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది చిరుధాన్యాలను సాగు చేసి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసి లాభాలను ఆర్జించాలని ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం దాదాపు 250-300 ఎకరాల్లో చిరుధాన్యాలను సభ్యులు సాగు చేయనున్నారు.
కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ద్వారా సీడ్స్, ఫెర్టిలైజర్స్తోపాటు వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నారు. డిసెంబర్ 2022 నాటికి విత్తనాలు, ఫెర్టిలైజర్స్, వేరుశనగ విత్తనాలు రూ.13,48,973 విలువ చేసే 834 బస్తాలు రైతులకు అందించగా.. అందులో అన్ని ఖర్చులు పోనూ రూ.19,184 ఆదాయాన్ని ఆర్జించారు. ఈ ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా మామిడి కాయల సేకరణనూ చేపట్టారు. 2019-20, 2020-21, 2022-23 ఏండ్ల కాలంలో సంస్థ రూ.58,51,807 మామిడికాయలను సేకరించి రూ.62,47,395 లకు విక్రయించింది. అన్ని ఖర్చులు పోనూ 1,48,588 లాభాన్ని రైతులు ఆర్జించారు. మరోవైపు సంబంధిత ఎఫ్పీవో ద్వారా సీతాఫలాలను కూడా సేకరించారు. 2021-2022లో రూ.11,23,506 సీతాఫలాలను కొనుగోలు చేసి 17,97, 362లకు విక్రయించగా నికరంగా రూ.6,23,276 లాభాన్ని పొందారు.
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో సీహెచ్సీ ద్వారా అద్దెకు 18 రకాల వ్యవసాయ పరికరాలను రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, నాగళ్లు, విత్తనాలు వేసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్ట్టే మిషన్, మామిడి చెట్లకు మందులు పిచికారీ చేసే పరికరాలు, చిన్న, పెద్ద రొటవేటర్లు ఉన్నాయి. వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం సెర్ప్ ద్వారా రూ.27 లక్షలను కేటాయించగా రూ.26, 98,350 పరికరాలను కొనుగోలు చేశారు. వాటిని ఎఫ్పీవోలో ఉన్న సభ్యులకు బయట మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నారు. పేద రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పరికరాలను ఎఫ్పీవో అందజేస్తున్నది. దీని ద్వారా ఏడాదిలో రూ.3,31,809 ఆదాయం రాగా ఖర్చులు పోనూ రూ.1,31,809ల వరకు నికర లాభం పొందారు.
శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సెర్ప్ సహకారంతో సీజనల్ వ్యాపారాలు చేస్తున్నాం. రైతులకు ఎరువులు, విత్తనాలనందిస్తున్నాం. వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మహిళా రైతులకు తక్కువకే వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇస్తున్నాం. మామిడి, సీతాఫలాలను సేకరించి విక్రయించి లాభాలు పొందుతున్నాం.
– అలివేణి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, కులకచర్ల
శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారు ల సంఘం ద్వారా చిరుధాన్యాలను పండించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. రైతులు పండించిన చిరుధాన్యాలకు మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఎఫ్పీవో ద్వారా నిర్వహించే కార్యక్రమాలను మహిళా సంఘాల సభ్యులకు వివరిస్తున్నాం.
– సత్యమ్మ, కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం కోశాధికారి