స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. అన్ని వర్గాలకు సముచితస్థానం కల్పిస్తూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సాయమందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి భరోసా కల్పించారన్నారు. అమరుల త్యాగాలు చిరస్మరణీయంగా ఉండేలా భవనాలు, ఫ్లైఓవర్లు, క్రీడా మైదానాలు తదితర వాటికి అమరవీరుల పేర్లు పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. తమవారు అమర జ్యోతులుగా మారి తమ ఇంటి వెలుగైండ్రని పేర్కొంటున్నారు. ప్రభుత్వ అండతో తాము నేడు గుండె ధైర్యంతో జీవనం సాగిస్తున్నామని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కలెక్టరేట్లలో అమరవీరుల కుటుంబాలను సన్మానించనుండగా, వికారాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించనున్నారు.
-రంగారెడ్డి, జూన్ 21(నమస్తే తెలంగాణ)
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఏండ్ల పోరాటం, అమరుల త్యాగాలు, ఉద్యమ ఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి అమరుల త్యాగాలు ఊపిరి పోశాయి. ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పాటైన రాష్ట్రంలో అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట ప్రకారమే అమరుల కుటుంబాలకు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగధనుల కుటుంబాలు కొడుకును, భర్తను, తమ్ముడిని ఇలా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోగా ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించి నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు.
వికారాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు చెందిన వికారాబాద్ మండలం మదన్పల్లి గ్రామానికి చెందిన యాదయ్య, వికారాబాద్ మున్సిపాలిటీలోని గంగారంకు చెందిన దీపక్, మర్పల్లి మండలం ఘణపురం గ్రామానికి చెందిన మేశెట్ తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించనున్నారు.
రంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : చేతికొచ్చిన కొడుకు.. అండగా ఉండాల్సిన భర్త.. ఆప్యాయతలు పంచాల్సిన తండ్రి.. ఇలా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎందరో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. కాసోజు శ్రీకాంతచారి మొదలుకొని సిరిపురం యాదయ్య, కొప్పు వాసు, మంగలి జంగయ్య, నరాల తిరుమలేశు, మాధపురం ప్రేమ్రాజ్, మందడి యాదిరెడ్డి, కొమ్మ యాదయ్య, దేవేందర్ ఆత్మార్పణం చేసుకున్నారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలు స్మరించుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీకాంతచారి పేరును ఎల్బీనగర్ ఫ్లైఓవర్కు, సిరిపురం యాదయ్య పేరును బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా మైదానానికి నామకరణం చేసింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుతున్నది. రంగారెడ్డి కలెక్టరేట్లోనూ అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అమరవీరులకు ఘన నివాళులు అర్పించడంతోపాటు వారి కుటుంబాలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు.
– యాదయ్య భార్య విజయలక్ష్మి , బూర్గుల, ఫరూఖ్నగర్ మండలం
రెక్కాడితేగానీ డొక్కనిండని పరిస్థితులు మావి. ఇద్దరం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్లం. నాటి ఉద్యమ రోజుల్లో లేచినప్పటి నుంచి పడుకునేవరకు తెలంగాణ రావాలి.. తెలంగాణ రావాలి అనేవాడు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పదిమందికి చెపుతుండేవాడు. ఎక్కడికి వెళ్లినా ఉద్యమ స్ఫూర్తిని చాటేవాడు. ఎప్పుడూ తెలంగాణ గురించి తప్ప వేరో ఆలోచన లేదా అని ఆయనతో కొట్లాడేదాన్ని. ఉమ్మడి పాలన నాయకులు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని మదనపడి 2013లో ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని తెలంగాణ కోసం అమరుడయ్యాడు. కొన్ని రోజుల్లోనే తెలంగాణ వచ్చింది. బతికుంటే తెలంగాణను చూసి మురిసిపోయేవాడు. మాకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఇచ్చారు. ఆ నగదుతోనే మా పెద్ద కూమార్తె పెండ్లి చేశాను. అనంతరం నాకు షాద్నగర్లోని బాలికల బీసీ హాస్టల్లో ఉద్యోగం ఇచ్చారు. నా భర్త ఏ ఆశయంతో అమరుడయ్యాడో ఆయన అశయాలను నెరవేరుస్తున్న దైవం కేసీఆర్ సారు. అమరువీరులకు అండగా నిలిచిన కేసీఆర్ సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పావని, దేవేందర్నాయక్ భార్య, పొన్నగుట్ట తండా, శంకర్పల్లి మండలం
సమైక్య రాష్ట్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు చితికి పోయాయి. తెలంగాణ ఉద్యమంలో దేవేందర్ చురుకుగా పాల్గొనేవాడు. వరంగల్లో జరిగే తెలంగాణ సభకు వెళ్లాలని నాతో చెప్పాడు. అదే ఆలోచనతో పడుకున్న ఆయన ఆంధ్ర పాలకులు చేస్తున్న కుతంత్రాలతో తెలంగాణ రాదేమోనని అదే రాత్రి (2010 జనవరి 28న) గుండెపోటుతో మరణించాడు. కుటుంబ అవసరాలు తీర్చే ఆయన చనిపోవడంతో మాకు తీరని బాధను మిగిల్చాడు. ఇంత బాధలో ఉన్న మమ్మల్ని సీఎం కేసీఆర్ గుర్తించి మాకు అండగా నిలబడి రూ.5 లక్షలు అందించారు. ఆ డబ్బుతోనే కూతురును చదివిస్తున్నా. నేను ప్రేవేటు పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. భర్త పోయిన తనను అదుకున్న సీఎం కేసీఆర్కు పాదాభివందనం. మా ఆయన త్యాగం ఊరికే పోలేదు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి 4 కోట్ల ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారు.
– అమరుడు మాధపురం ప్రేమ్రాజ్ భార్య లక్ష్మి, ఎక్లాస్ఖాన్పేట, కేశంపేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా సీమాంధ్రులు అడ్డుపడుతుండడంతో రాష్ట్రం ఇక రాదేమోనని కలత చెందిన నా భర్త ప్రేమ్రాజ్ తెలంగాణకు మద్దతుగా 2011 సెప్టెంబర్ 3న ఇంటి వద్దనే ఆత్మాహుతి చేసుకున్నాడు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులు, నేను, ముగ్గురు చిన్నపిల్లలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసుకున్న అమరుల కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షలతోపాటు ఉద్యోగం ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. నా భర్త మరణంతో తీవ్ర నిరాశ, నిస్సృహలకు గురైన నాకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు ఇచ్చిన ఉద్యోగం కొత్త జీవితానికి దారి చూపింది. నాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వెల్దండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా ఉద్యోగం ఇవ్వడంతో నెలజీతంతో పిల్లలను చదివించుకుంటూ, అత్తమామలతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రేమ్రాజ్ తండ్రి సాయిలుకు ప్రతి నెలా ఆసరా పింఛన్ రూ.2016లను ప్రభుత్వం అందజేస్తున్నది.
– మేశెక్ తల్లిదండ్రులు రాములు, హేమలత, ఘనాపురం, మర్పల్లి మండలం
నా బిడ్డ మేశెక్ ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కనేవాడు. తోటి స్నేహితులతో ఎప్పుడూ తెలంగాణ గురించే మాట్లాడేవాడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం, ధూంధాం కార్యక్రమాలతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రత్యేక తెలంగాణ రాదేమోనని.. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందేమోని 2010 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మా కుటుంబ పరిస్థితి అధ్వానంగా మారింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనే ఆనందం ఒక వైపు.. కానీ తమ కొడుకు తమకు దక్కకుండా పోయాడనే మరో వైపు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచి రూ.10లక్షలు ఇవ్వడంతోపాటు తమ కూతురు హెప్సిబాకు హైదరాబాద్లోని నాంపల్లి కమర్షియల్ ఇన్కంటాక్స్ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. హెప్సిబాకు వివాహం చేయడంతోపాటు కొన్ని అప్పులు తీర్చుకున్నాం. మేశెక్ త్యాగం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా ప్రభుత్వం అండగా నిలువడం సంతోషంగా ఉంది.. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు. 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తనకు ఆహ్వానం అందించి సత్కరించనుండడం చాలా సంతోషంగా ఉందని రాములు తెలిపారు.
– యాదయ్య తల్లిదండ్రులు గోపాల్, అనసూజమ్మ, మదన్పల్లి, వికారాబాద్
మాకు ఇద్దరు సంతానం. కుమారుడు యాదయ్య, కూతురు మమత. యాదయ్య వికారాబాద్లో సిద్ధార్థ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతుండేవాడు. 2010లో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో ప్రతిరోజూ వికారాబాద్కు వచ్చి ఉద్యమంలో పాలుపంచుకునేవాడు. ఆంధ్రపాలకుల పెత్తందారులతో తెలంగాణ రాదేమోనని తరచూ భయపడేవాడు. ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ సిద్ధిస్తుందని భావించి 2010 సెప్టెంబర్ 26న ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా వారంపాటు చికిత్స పొందుతూ అక్టోబర్ 2న చనిపోయాడు. అప్పుడు మమత 10వ తరగతి చదువుతుండేది. కేసీఆర్ సీఎం అయ్యాక 2014లో మా కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు అందజేసింది. 2016లో కూతురు మమతకు ఉద్యోగం ఇచ్చారు. రూ.10లక్షలతో అప్పులు తీర్చుకొని, కూతురు వివాహానికి ఖర్చు చేశాం. వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో మమత జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నది. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం సహాయం చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– వాసు భార్య శోభ, ఆమనగల్లు మండలం
నాకు ఇద్దరు కుమారులు. నా భర్త వాసు ఎప్పుడు చూసినా తెలంగాణ ఎప్పుడొస్తదో అని ప్రతి దినం తలుచుకుంటూ ఆమనగల్లు మండలంలో జరిగే ప్రతి ఉద్యమ కార్యక్రమంలో పాలుపంచుకునేవాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో రైలు రోకోకు బయలుదేరిన ప్రస్తుత మంత్రి శ్రీనివాస్గౌడ్, ఉద్యమ నాయకుడు కోదండరాంను అరెస్ట్ చేసినందుకు (2013) నిరసనగా పురుగుల మందు తాగి చనిపోయాడు. దీంతో ఎంతో బాధపడ్డాను. ఈ విషయం తెలుసుకున్న ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు, మరికొంత మంది వాసు మృతదేహాన్ని హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పరామర్శించారు. ఆందరి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి కావడంతో వాసు భార్యగా నాకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయం చేసింది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం పొందాను. ప్రస్తుతం నేను వెల్డండ మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు ఎంతో సాయం చేసిన సీఎం కేసీఆర్ సారు సల్లగుండాలే. కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి.
– దీపక్ భార్య సబిత, గంగారం, వికారాబాద్
మావారు దీపక్ ఇంటర్ వరకు చదువుకొని బెంగుళూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తుండేవారు. 2009లో నాతో వివాహం జరిగింది. వికారాబాద్లో నివాసం ఉండేవాళ్లం. 2011-12లో తెలంగాణ రాష్ట్రం కోసం వికారాబాద్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు బాబు రాఖీకి మూడేండ్లు. ఉద్యమ సమయంలో దీపక్ ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి.. పగలు అను చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం శ్రమించేవారు. ఉద్యమ సమయంలో పోలీసులు జైలులో పెట్టిన సందర్భాలున్నాయి. సీమాంధ్ర పెత్తందారులను తరిమికొట్టేందుకు ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. 2011లో విద్యార్థి సంఘాలు, ఉద్యమ నాయకులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు. ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో 2011 అక్టోబర్ 4న వికారాబాద్ బస్టాండ్లో ఉద్యమకారులతో కలిసి బస్సును తగులబెట్టేందుకు ఎక్కి నిప్పంటించుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కొంతమంది ఉద్యమకారులు అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 9 నెలలు చికిత్స పొందాడు. అనంతరం వికారాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ 2012 మే 26న మృతిచెందాడు. తనను, బాబును ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోవడంతో ఎంతో కుమిలిపోయాను. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ మాట ఇచ్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రూ.10లక్షలు అందజేశారు. 2016లో ప్రభుత్వ ఉద్యోగం అందించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. వచ్చిన రూ.10లక్షలతో అప్పులు తీర్చుకున్నాను. ఇంటి మరమ్మతులు చేసుకున్నాను. బాబు చదువుకు ఖర్చు పెట్టాను. హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. బాబు రాఖీ వికారాబాద్ అంబేద్కర్ పారా మెడికల్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలను జూన్ 2న ఘనంగా సన్మానించడం బాగుంది. నా భర్త పోరాటం వృథా కాలేదు. మాకు సీఎం కేసీఆర్ సారు అండగా ఉన్నంత వరకు మేము అనాథలం కాము. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించింది. అన్ని వర్గాల వారికి సమాన పాలన అందిస్తున్న కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జంగయ్య భార్య బాలమణి, ఊరెళ్ల, చేవెళ్ల మండలం
నాకు ఇద్దరు కుమారులు రాజు, శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నా భర్త జంగయ్య 2011లో అమరులయ్యారు. అమరుల కుటుంబాలకు తప్పనిసరిగా సాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారులు మా ఇంటికి వచ్చి ఏం సహాయం జేస్తరో అనుకున్నం. కానీ ఇంత పెద్ద సాయం చేస్తారనుకోలేదు. రూ.10లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. చెప్పినట్లే నా చిన్న కొడుకు శ్రీనివాస్కు 2015లో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా కొడుకుకు రూ.38 వేల జీతం వస్తున్నది. ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం. అందుకు సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.