షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించే పనిలో ఎన్నికల యంత్రాంగం నిమగ్నమైంది. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు, గోడపత్రికలను అతికించాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ప్రచారం.. ఆ తర్వాత నిషేధం. ప్రచారంపై నిఘా పెట్టేందుకుగాను మొబైల్ బృందాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనున్నది. ఉమ్మడి జిల్లా అంతటా పోలీసులు నిఘా పెంచనున్నారు. చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే రూ.50 వేల వరకు నగదు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే నగదును సీజ్ చేస్తారు.‘కోడ్’ను ఉల్లంఘిస్తే జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోనున్నది.