తెల్లవారుజాము నుంచే ఉపాధ్యాయుల విధులు
పిల్లలకు ఫోన్లు చేస్తూ..చదువాలని సూచన
వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి
ఆయా సబ్జెక్టుల్లో రాణించేలా ప్రయత్నం
సాయంత్రం రుచికరమైన స్నాక్స్ అందజేత
రంగారెడ్డి, మార్చి 4(నమస్తే తెలంగాణ) ;‘ఏమమ్మా.. మీ అబ్బాయి నిద్ర నుంచి లేచాడా?.. చదువుతున్నాడా లేదా మళ్లీ పడుకున్నాడా ’ తెల్లవారుజామున 5 గంటలకు ఓ పదోతరగతి విద్యార్థి తల్లిని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఫోన్లో అడిగిన ప్రశ్న ఇది.‘లేచి చదువుకో. ఆ పాఠం మననం చేసుకో. శ్రద్ధ పెట్టు. ఫోన్, టీవీలు దూరం పెట్టు’ ఉదయం 5 గంటలకు విద్యార్థినికి ఫోన్చేసి టీచర్ చెప్పిన మాటలివి.
ఈ రెండు మాటలు చాలవా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది. సిలబస్పై విద్యార్థులు పట్టు సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా స్నాక్స్ సిద్ధం చేయిస్తున్నది.
ప్రతి ఒక్కరిపై దృష్టి..
పదోతరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పాఠశాలల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. ఉపాధ్యాయులు.. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వివిధ కేటగిరీలుగా విభజించారు. బాగా చదివేవారిని ఏ కేటగిరీగా..పర్వాలేదనిపించే వారిని బీ కేటగిరీగా.. చదువులో వెనుకబడిన విద్యార్థులను సీ కేటగిరీ లో చేర్చి.. వారికి అనుగుణంగా పాఠాలను బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. బీ కేటగిరీలో ఉన్న విద్యార్థులను ఏ కేటగిరీలో చేరేందుకు అనువుగా బోధిస్తున్నారు. ఇప్పటికే ఏ కేటగిరీలో ఉన్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు.
ఒక్కో టీచర్కూ ఐదుగురి బాధ్యత
తమ పాఠశాలలో 36 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారని, ఒక్కో టీచర్కూ ఐదుగురు విద్యార్థులను దత్తతగా ఇచ్చినట్లు కుంట్లూర్లోని జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రావు తెలిపారు. వారి చదువు బాధ్యత ఆ ఉపాధ్యాయులే తీసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులు ఏం చదువుతున్నారు? చదివే విధానం ఎలా ఉన్నది? ఇంకా మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? తదితర అంశాలపై దృష్టిపెట్టామన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ఇతర పనులు చెప్పొద్దని, చదువుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని తల్లిదండ్రులకు సూచించామ న్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో అందిస్తున్న స్నాక్స్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని పెద్దఅంబర్పేట జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు చెప్తున్నారు. విద్యార్థులకు నచ్చేలా.. వారు మెచ్చేలా ఒక్కో రోజు ఒక్కో రకమైన తినుబండారాలను అందిస్తున్నామని తెలిపారు. టీచర్లు అందిస్తున్న హ్యాండ్ బుక్ సైతం మంచి ఫలితాల సాధనలో ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
తెల్లవారుజామునే విద్యార్థులకు ఫోన్లు
తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఐదుగురు విద్యార్థులను ఇప్పటికే దత్తత తీసుకున్న ఉపాధ్యాయులు.. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు వారికి ఫోన్ చేస్తున్నారు. నిద్రలేపి చదువుకునేలా చూస్తున్నారు. విద్యార్థులే ఉదయం లేచి ఉపాధ్యాయులకు మెసెజ్ పెట్టేలా చేస్తున్నారు. నిజంగానే విద్యార్థులు నిద్రలేచి చదువుతున్నారా..? లేదా ఫోన్ పెట్టేసి మళ్లీ పడుకుంటున్నారా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులతోనూ మా ట్లాడుతున్నారు. టీచర్ల ఫోన్ నంబర్లను సైతం తల్లిదండ్రులకు ఇస్తున్నారు.
మంచి ఫలితాలకు దోహదం
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఐదుగురు చొప్పున విద్యార్థులను టీచర్లు దత్తత తీసుకున్నారు. వారి చదువు బాధ్యత వారే చూసుకుంటున్నారు. ఇది మంచి ఫలితాలు తెచ్చేందుకు దోహదం చేస్తుంది. ప్రత్యేక తరగతుల సమయంలో ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారం విద్యార్థులకు ఉపయోగపడుతున్నది. విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా, వారికి నచ్చిన స్నాక్స్ అందజేస్తున్నాం.
– రాంచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, పెద్దఅంబర్పేట జడ్పీహెచ్ఎస్