శంకర్పల్లి, మార్చి 15 : ‘తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నది. ప్రమాదాలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది.. క్యాన్సర్ వంటి వ్యాధులను తట్టుకునే శక్తి నీరాకు ఉన్నది.. హైదరాబాద్లో నీరా కేఫ్ను ప్రభుత్వం ప్రారంభించింది..’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీతో దాడులు చేయిస్తున్నదని, ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వాయి పాపన్న లాంటి మహనీయులను మనం ఆదర్శంగా తీసుకుని జీవించాలని అన్నారు. ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని హైదారాబాద్లో నీరా కేఫ్ను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తుందన్నారు. సర్వాయి పాపన్న లాంటి మహనీయులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం సహకారంతో చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఎన్కతల శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, సర్పంచ్ అనితా సురేందర్గౌడ్, నవాబ్పేట్ ఏఎంసీ ప్రశాంత్గౌడ్, కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్, మండల అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేందర్గౌడ్ పాల్గొన్నారు.