వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిలబస్తోపాటు రివిజన్ను కూడా పూర్తి చేశారు. వార్షిక పరీక్షలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు వీలుగా అధికారులు గత నెలలో ప్రీ-ఫైనల్-1 పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రీ-ఫైనల్-2 పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. వచ్చే నెల మూడు నుంచి జరుగనున్న వార్షిక పరీక్షలకు స్టూడెంట్స్ను అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లు ఉండనున్నాయి. జిల్లాలో 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 13,324 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 6,523 మంది బాలికలు.. 6801 మంది బాలురు ఉన్నారు. పరీక్షలు ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా నిఘా నీడలో జరుగనున్నాయి.
బొంరాస్పేట, మార్చి 19 : జిల్లాలో ఈ ఏడాది జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది మంచి ఫలితాలు తీసుకురావడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. ఇందులో భాగంగా సిలబస్ను, రివిజన్ను త్వరితగతిన పూర్తిచేశారు. గతేడాది డిసెంబర్ నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మారిన పరీక్షా విధానంపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందిస్తున్నారు. వార్షిక పరీక్షలపై పట్టు సాధించడానికి ఈ ఏడాది విద్యాశాఖ రెండు సార్లు ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నది. గత నెలలో ప్రీ-ఫైనల్-1 పరీక్ష ముగియగా ఈ నెల 15 నుంచి ప్రీ-ఫైనల్-2 పరీక్ష కొనసాగుతున్నది. వచ్చే నెల 3 నుంచి నిర్వహించే వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్ని రకాలుగా సంసిద్ధులను చేస్తున్నారు. గతేడాది జిల్లాలో పదో తరగతిలో 92.04 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది దానిని మించి సాధించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
ఎస్సెస్సీ పరీక్షా విధానంలో ప్రభుత్వం ఈ ఏడాది మార్పులు చేసింది. గతేడాది కరోనా కారణంగా సిలబస్ను తగ్గించడంతో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం పూర్తి సిలబస్తో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్కో సబ్జెక్ట్కు పేపర్-1, పేపర్-2తో పరీక్షలు నిర్వహించేవారు. ఈ విధానంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాసేటప్పుడు విద్యార్థులకు (చాయిస్) అవకాశం ఇచ్చే వారు. ఉదాహరణకు ఆరు ప్రశ్నలు ఇచ్చి మూడు ప్రశ్నలకు జవాబులు రాయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు మారిన విధానంలో విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వలేదు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఇచ్చారు. మిగతా వాటికి ఇవ్వలేదు. ఈ మారిన విధానంపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కల్పించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మూడు ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) పరీక్షలు, రెండు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు గతంలో ఒకేసారి నిర్వహించే ప్రీ-ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది రెండు సార్లు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు మారిన పరీక్షా విధానంపై పూర్తిగా అవగాహన కలుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
అకాడమిక్ పరంగా ఫలితాల సాధనకు చేసే కృషితో పాటు పాలనా పరంగా కూడా జిల్లా విద్యాశాఖ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణకు 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికీ ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ను నియమించారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్, 200 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా మరో ఇన్విజిలేటర్ను నియమిస్తారు.
వార్షిక పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా కట్టుదిట్టంగా పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గతంలోలాగానే ఈ ఏడాది కూడా ఎస్సెస్సీ వార్షిక పరీ క్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్న పత్రాల బండిల్ తెరిచేటప్పుడు, జవాబు పత్రాలను సీల్ చేసే సమయంలో ఆ గదిలో తప్పక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికే వీటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రశ్న పత్రాలు కూడా త్వరలో పోలీస్ స్టేషన్లకు చేరుకోనున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది 334 పాఠశాలల నుంచి 13,324 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 6,523 మంది బాలికలు, 6801 మంది బాలురు ఉన్నారు. వీరిలో 165 జడ్పీ పాఠశాలల్లో 6,371 మంది, 9 ప్రభుత్వ పాఠశాలల్లో 512 మంది, 18 కేజీబీవీలలో 732 మంది, 9 మాడల్ స్కూళ్లలో 844 మంది, 2 టీఆర్ఈఐఎస్ నుంచి 150 మంది, 3 ఎయిడెడ్ పాఠశాలల నుంచి 51 మంది, 10 బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల నుంచి 667 మంది, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని 7 పాఠశాలల నుంచి 540 మంది, 6 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల నుంచి 320 మంది, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని 4 పాఠశాలల నుంచి 373 మంది, 6 మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 274 మంది, 95 ప్రైవేటు పాఠశాలల నుంచి 2490 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
జిల్లాలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ, వైద్య శాఖల తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించాం. శనివారం చీఫ్ సూపరింటెండెంట్ల సమావేశం నిర్వహించాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరాం. వసతి గృహాల్లో విద్యార్థులు చదువుకుంటున్నందున నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని సంబంధిత అధికాలను కోరాం. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎంను పెడుతున్నాం. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరాం. నాలుగు రూట్లలో స్కాడ్ను నియమిస్తున్నాం. త్వరలో జిల్లాకు ప్రశ్న పత్రాలు వస్తాయి. వాటిని బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్లకు చేరవేస్తాం. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎస్సెస్సీలో 92.04 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది దానిని అధిగమించడానికి కృషి చేస్తున్నాం.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్