సీఎం కేసీఆర్ మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కష్టాలు తీరనున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె తమకూ అన్ని రకాల సదుపాయాలు అందనున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 2766 మంది ఉద్యోగులకు, వికారాబాద్ జిల్లాలో 1075 మందికి ప్రయోజనం చేకూరనున్నది.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం మిన్నంటింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఎవరిని పలుకరించినా మేము ఊహించనిది, ఉద్యోగుల కడుపు నింపేలా చక్కటి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆర్టీసీ ఉద్యోగులపై అత్యంత సానుకూలమైన ఆలోచనతో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎప్పుడూ లేని విధంగా పీఆర్సీ ఇవ్వడం మొదలుకొని ఆర్టీసీని ఆదుకునే అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇందుకుగాను విధివిధానాల రూపకల్పనకు పలువురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. ప్రజలకు సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిస్థాయిలో కాపాడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి ఉదాత్తమైన నిర్ణయంతో సీఎం కేసీఆర్ మరోసారి ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూర్చారని తెలిపారు.
ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడే నిర్ణయం ఒక్కసారిగా సదరు ఉద్యోగుల కుటుంబాలను ఆనంద డోలికల్లో విహరింపజేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో తమ కష్టాలు కడతేరిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె తమకు అన్ని రకాల సదుపాయాలు అందనున్నాయని వారు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 2766 మంది, వికారాబాద్ జిల్లాలో 1075 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. జిల్లా పరిధిలో పరిగి డిపోలో 375 మంది, తాండూరు డిపోలో 400 మంది, వికారాబాద్ డిపోలో 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 1075 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రివర్గం ఆమోదించడం చాలా గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్కు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇలాంటి సాహసోపేత నిర్ణయం ద్వారా సీఎం కేసీఆర్ మరోసారి ఆర్టీసీ ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ప్రభుత్వ నిర్ణయంతో మరింత చక్కటి సేవలు అందించి సంస్థను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి శతవిధాలా కృషి చేస్తాం.
-జేఆర్ ప్రసాద్, ఉద్యోగి, ఆర్టీసీ పరిగి డిపో
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చరిత్రలో నిలిచిపోతుంది..
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రలో నిలిచిపోతుంది. రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మరిన్ని సేవలు అందించి, అభివృద్ధికి కృషి చేస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు, మంత్రులకు, ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– జీవీకే రెడ్డి, టీజేఎంయూ రాష్ట్ర కార్యదర్శి(వికారాబాద్)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఉద్యోగులమంతా రుణపడి ఉంటాం. ఆర్టీసీ సంస్థలను, ఉద్యోగులను గుర్తించి వారికి సరైన న్యాయం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ నిలిచారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు మంత్రులకు, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పద్మ, ఆర్టీసీ రీజన్ కమిటీ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్, వికారాబాద్
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్నారు..
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనడం సంతోషకరం. జీవితాంతం ఆర్టీసీ కార్మిక కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాయి. ఆగస్టు 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేబినెట్ సమావేశంలో చెప్పడంతో ఆర్టీసి కార్మికుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
– విశ్వనాథ్గౌడ్, లాజిస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, పరిగి
సీఎం కేసీఆర్ది గొప్ప నిర్ణయం
సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకొని, చరిత్ర సృష్టించారు. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పెద్ద సాహసం. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. కేసీఆర్ మరో చరిత్ర సృష్టించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆర్టీసీ కార్మికలోకం సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. కార్మికుల కండ్లల్లో సంతోషాన్ని నింపారు.
– ఫకీరప్ప,కండక్టర్, తాండూరు
చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో ఎవరూ సాహసించని విధంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరం. సీఎం కేసీఆర్కు, మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
– కె.ఆర్.చారి, ఉద్యోగి, ఆర్టీసీ పరిగి డిపో
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషకరం..
ఎన్నో ఏండ్లుగా ఆర్టీసీ ఉద్యోగులుగా పనిచేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులం కావాలని ఆశతో ఉన్నాం. ఇన్ని రోజులు ఓపికతో ఉన్న మాకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో శుభసూచుకం. ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం.
– కె.గోపాల్, టీజేఎంయూ వికారాబాద్ డిపో సెక్రటరీ
చాలా సంతోషంగా ఉన్నది..
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనడం సంతోషంగా ఉన్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆర్టీసీ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు.
– అల్లి మల్లేశ్, కండక్టర్, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం (మెహిదీపట్నం డిపో)
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది..
ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గొప్ప శుభవార్త చెప్పారు. ఇంతగొప్ప చారిత్రాత్మాక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– బజారు భిక్షపతి, ఆర్టీసీ కండక్టర్.. (ఇబ్రహీంపట్నంరూరల్)
ఎంతో సంతోషించదగ్గ విషయం..
ఆర్టీసీ ఉద్యోగుల కల సీఎం కేసీఆర్ చల్లని దీవెనతో నెరవేరింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి కార్మికుడు కష్టపడి పనిచేస్తారు.
– అశోక్రాజు, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీఎం.. (ఇబ్రహీంపట్నం)
ఇక దర్జాగా బతుకుతాం..
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చాలా సంతోషకరం. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా నింపింది. ఆర్టీసీ సిబ్బంది తమ పిల్లలను దర్జాగా పెంచి పోషించేలా ధైర్యం నింపింది.
– వనం సాంబయ్య, డ్రైవర్(బండ్లగూడ బస్ డిపో), తట్టిఅన్నారం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ