షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన కేసీఆర్ను యావత్ దేశ రైతాంగం ప్రశంసిస్తుందని తెలిపారు. జాతీయస్థాయి నేతలు తెలంగాణకు వచ్చి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 10వేలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ. 10,500 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ. 16వేల కోట్లు మొదటి విడుతలో ఖర్చు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.