తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వికారాబాద్ జిల్లాకు మహర్దశ వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు అభివృద్ధి కోసం అధిక నిధుల మంజూరుతో దశ, దిశ మారింది. దీనికి తోడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద ప్రాజెక్టు ‘మొబిలిటీ వ్యాలీ’ జిల్లాకు మణిహారంగా నిలువనున్నది. మోమిన్పేట మండలం ఎన్కతలలో 1200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానున్నది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు వాహనాల విడి భాగాలు తయారు కానున్నాయి. ఇప్పటికే రెవెన్యూ అధికారులు భూ సేకరణ ప్రక్రియను షురూ చేశారు.
ఎన్కతల గ్రామంలోని సర్వే నంబర్ 174, 198లలో 536.39 ఎకరాల్లోని అసైన్డ్ భూములతోపాటు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నది. అసైనీలకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారాన్ని నెల రోజుల్లోగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అసైనీలకు కంపెనీలో ఉద్యోగం, వారి పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి టీఎస్ఐఐసీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం భూములను అప్పగించనున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లా కేంద్రంతోపాటు ముంబై జాతీయ రహదారికి వెళ్లే సదాశివపేట్, మర్పల్లి వరకు పలు ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నందున జిల్లా రూపురేఖలు మారనున్నాయి.
వికారాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అతిపెద్ద ప్రాజెక్టు జిల్లాలో ఏర్పాటు కానుంది. మోమిన్పేట మండలం ఎన్కతలలో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనున్నది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. ప్రత్యేక వికారాబాద్ జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లాకు భారీ ప్రాజెక్టు రావడంపై జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగావకాశాలను కల్పించడమే లక్ష్యంగా..
ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లతో కూడిన మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రానున్న ఐదేండ్లలో 50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రానున్న 2-3 వారాల్లోనే ఎన్కతలలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో దాదాపు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముండగా.. రాష్ట్ర ఐటీ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో జిల్లా యంత్రాంగం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు నెలరోజుల్లోగా భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి సంబంధిత భూములను టీఎస్ఐఐసీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్పగించనున్నది. తదనంతరం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సంబంధిత భూమిని అభివృద్ధి చేసి అవసరమైన వసతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నెల రోజుల్లోగా అసైనీలకు నష్టపరిహారాన్ని చెల్లించే ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు.
తుది దశకు చేరుకున్న భూ సేకరణ ప్రక్రియ
మోమిన్పేట మండలం ఎన్కతల గ్రామం సర్వే నం.174, 198లలో 536.39 ఎకరాల్లోని అసైన్డ్ భూములతోపాటు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అసైన్డ్, ప్రభుత్వ భూములతోపాటు పట్టా భూములను కూడా మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు నిమిత్తం సేకరించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్కతల గ్రామపంచాయతీ పరిధిలోని 536 ఎకరాలకు సంబంధించిన 380 మంది అసైనీలతో వికారాబాద్ డివిజినల్ రెవెన్యూ అధికారి విజయకుమారి, మోమిన్పేట తహసీల్దార్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో మాట్లాడి భూసేకరణ ప్రక్రియను వేగిరం చేశారు.
జిల్లాలో విస్తరించనున్న అభివృద్ధి
జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో మోమిన్పేట, నవాబుపేట మండలాలతోపాటు వికారాబాద్ వరకు అభివృద్ధి విస్తరించనున్నది. మొబిలిటీ వ్యాలీ అందుబాటులోకి వచ్చినట్లయితే మరిన్ని పరిశ్రమలు చుట్టుపక్కల వెలసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎకరా భూమి ధర రూ.కోట్లలో ఉండగా, మరింత పెరుగనుంది. మరోవైపు మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్ శివారు ప్రాంతం వరకే పరిమితమైన భారీ ప్రాజెక్టులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక దృష్టితోనే జిల్లాలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో వికారాబాద్తోపాటు ముంబై జాతీయ రహదారి వెళ్లే సదాశివపేట్, జిల్లాలోని మర్పల్లి వరకు భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతోపాటు అన్ని విధాల జిల్లా అభివృద్ధిలోకి రానున్నది.
అసైనీలకు ఎకరాకు రూ.17 లక్షల నష్టపరిహారం
ప్రభుత్వ మార్కెట్ ధర ఎకరాకు రూ.2.50 లక్షలుండగా, అసైనీలకు నష్టం జరుగకుండా ఎకరాకు రూ.17 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత నష్టపరిహారాన్ని కూడా నెలరోజుల్లోగా అసైన్డ్దారులకు అందజేయనున్నారు. మరోవైపు అసైన్డ్దారుల కుటుంబాల్లోని అర్హులైన వారికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఉద్యోగాలను కూడా కల్పించనున్నారు. ఎన్కతలలో ప్రధానంగా అసైన్డ్దారుల కుటుంబాల పిల్లలకు నాణ్యమైన చదువును అందించే నిమిత్తం ప్రత్యేకంగా బాలురు, బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.
వారం రోజుల్లో టీఎస్ఐఐసీకి భూములను అప్పగిస్తాం
– విజయకుమారి, వికారాబాద్ ఆర్డీవో
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నాం. వారం రోజుల్లో సంబంధిత భూములను టీఎస్ఐఐసీకి అప్పగిస్తాం. ఎన్కతలలోని అసైన్డ్ భూములతోపాటు ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం. అసైనీలకు నెలరోజుల్లోగా నష్టపరిహారాన్ని అందజేస్తాం. మరోవైపు ప్రభుత్వం పట్టా భూములను కూడా సేకరించాలని ఆదేశిస్తే, ఆ మేరకు చర్యలు చేపడుతాం.