తాండూరు రూరల్ : నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం, అంతారంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ. 5లక్షల వ్యయంతో 16చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో తమ పనైపోయిందనుకోకుండా, వాటిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. గ్రామంలో సంవత్సర కాలంగా ఎలాంటి గొడవలులేకుండా, ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషంగా ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల నేరాల సంఖ్య బాగా తగ్గుతూ వస్తోందన్నారు.
విదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాల వరకు నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. హైదరాబాద్లో అడుగడుగున సీసీ కెమెరాలున్నాయని, సుమారు 15 లక్షల వరకు ఉంటాయన్నారు. గతంలో జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల గ్రామాల్లో దొంగతనాలు, ఘర్షణలు, జరుగకుండా ఉండే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
అంతారం గ్రామ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసుతో మానవ సంబంధాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాజేందర్రెడ్డి, ఎంపీటీసీ శాంతయ్య, ఉపసర్పంచ్ జీవరత్నం, టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్ ఉన్నారు.