సుల్తాన్బజార్, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే గర్భిణులకు అవసరమయ్యే టిఫా, కలర్ డాప్లర్ యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో రెండు యంత్రాలను ఏర్పాటు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు.
కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకే..!
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు ప్రతిరోజు సుమారు వంద మంది గర్భిణులు వస్తుంటారు. అందులో అవసరమైన సుమారు 40 నుంచి 50 మంది రోగులకు టీఫా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టీఫా స్కానింగ్ పరీక్షలను కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా..? శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు చేస్తారు. ప్రైవేట్లో ఒక్కసారి ఈ పరీక్ష నిర్వహిస్తే సుమారు ఆరు వేలు ఖర్చు అవుతుందని, అలాంటిది ప్రసూతి దవాఖానలో ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.