కులకచర్ల, జనవరి 16 : పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలావరకు అనునిత్యం జరుగుతున్నాయి. ఆధునిక యుగంలో పెరుగుతున్న విలాసాలకు అనుగుణంగా అక్రమ విధానంతో సులభంగా డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడంతో బ్యాంకు ఖాతాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తాజాగా వచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని ఖాతాల ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వాలు, బ్యాంకులు తెలియజేస్తున్నాయి. దీనికి గాను ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలను తెరిచారు. దీంతో ఏటీఎం యంత్రాలు భారీగా ఏర్పాటు చేశారు. ఏటీఎంలలో నిత్యం రూ. కోట్లాది రూపాయల నగదు లావాదేవీలు ఏటీఎంల ద్వారా డ్రా చేస్తున్నారు. దీంతో పాటు బ్యాంకు అధికారులు మొబైల్ నెట్, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ఆర్థిక లావాదేవీలు నగదురహితంగా ఉండేందుకు ఫోన్పే, గూగుల్పే, పీటీఎంలతో పలువిధాలైన సౌకర్యాల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం లభించింది.
ఖాతాదారులకు ఇచ్చిన పాస్వర్డ్ల రక్షణలో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోవడంతో ఎంతో మంది మోసగాళ్ల చేతిలో నష్టపోతున్నారు. ఖాతాదారులకు ఫోన్ చేసి బ్యాంకు అధికారుల మంటూ నమ్మించడం, వెంటనే ఖాతా నంబర్, ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకొని నిమిషాల్లో బ్యాంకుఖాతాల్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. కొన్ని లింకులను ఖాతాదారులకు పంపించి వాటిపై క్లిక్ చేసిన వెంటనే ఆఫోన్నుండి నేరగాళ్లకు ఓటీపీ వెళ్లి క్షణాల్లోనే ఖాతాల్లో డబ్బులు ఖాళీ అవుతున్నాయి.
బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏటీఎం కార్డు మీద ఉండే నంబర్ కీలకం. బ్యాంకు ఖాతా నంబర్, పిన్ నంబర్, కార్డు వెనుకల ఉండే మూడంకెల సీవీవీ సంఖ్య తెలిస్తే చాలు.. ఖాతా నుంచి సొమ్మును దోచుకోవడం జరుగుతుంది.
ఖాతాదారులు తమ ఖాతాకు సంబంధించిన డబ్బులు డ్రాచేసుకోవడానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా అని ఓటీపీ ఎవరికంటే వారికి చెబితే వారి ఖాతాలు కూడా ఖాళీ అవుతాయి.
ఇటీవల ఎక్కువగా ఏటీఎం కార్డు నంబర్లు తెలుసుకొని నగదును అపహరణ చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలతో పాటు ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో కార్డుల క్లోనింగ్ చేసి మోసం చేస్తున్నారని సమాచారం. ఏటీఎం కార్డుల పూర్తి సమాచారం అపహరిస్తున్నారు. పిన్కోడ్ నమోదు చేసే సమయంలో నంబర్ పడేలా సీసీ కెమెరాలు ఉంచుతారు. ఏటీఎం కేంద్రాల వద్ద పరిచయం లేని వ్యక్తుల మధ్య వినియోగించకపోవడమే మంచిది.
ఆన్లైన్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్లకు వ్యక్తిగతంగా లింకులు పంపి వాటిని ఓపెన్ చేస్తే ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడతాయని, ఓటీపీ నమోదు చేయాలని సైబర్నేరగాళ్లు ఫోన్లు చేస్తుంటారు. సైబర్ నేరగాళ్లు మీ ఖాతా బ్లాక్ అవుతుంది. యూనో యాప్ బ్లాక్ అవుతుంది వెంటనే అప్డేట్ చేసుకోవాలని, ఓటీపీ నమోదు చేయాలని తెలియజేస్తూ వేలకొద్ది డబ్బులను బ్యాంకు ఖాతాల నుంచి కొట్టేస్తున్నారు.
లోన్ ఇస్తామంటూ ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. వాట్సాప్లో డాక్యుమెంటు పంపించాలని అడుగుతారు. తీరా పంపించాక ఓటీపీ చెప్పమని అడుగుతారు. ఓటీపీ నంబర్ చెప్పాక ఖాతాలో ఉన్న డబ్బులు డ్రాచేసుకుంటారు. సైబర్ నేరగాళ్లు వాడే ఫోన్లు సైతం ఫేక్ ఐడీలతో ఉండటంతో కేసులను ఛేదించడం ఇబ్బంది కరంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఫిషింగ్ ద్వారా.. వినియోగదారుడి పేరు పాస్వర్డ్ క్రెడిట్ కార్డు వివరాలను సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి చేసే నేరాన్ని ఫిషింగ్ అంటారు. విశ్వసనీయ సంస్థగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను వ్యక్తిగా మారు వేషాల ద్వారా మోసాలకు పాల్పడుతుతారు.
ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే తెలంగాణ సైబర్ క్రైమ్కు 1930కు సమాచారం అందించి వివరాలు తెలియజేయాలి. వెంటనే డబ్బులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సైబర్నేరగాళ్లు ఖాతాల్లోనుంచి పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారు. ఖాతాలో నుండి పోయిన సైబర్నేరగాళ్లు ఖాతాలను హోల్డ్లో ఉంచుతారు. దీని వలన పోయిన డబ్బులు కొంతమేరకైన కాపాడుకునేవాళ్లు అవుతారు.
డిసెంబర్ 31న హైదరాబాద్ తన సొంత పనుల నిమిత్తం వెళ్లగా హైదరాబాద్లో కులకచర్ల గ్రామానికి చెందిన ఎర్ర విష్ణువర్ధన్రెడ్డి తన దగ్గర ఉన్న ఫోన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేయడంతో పాటు సైబర్ నేరగాళ్ల చేతిలో ఫోన్ పడింది. అతడి ఖాతాలో ఉన్న 2లక్షల 21వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు డ్రాచేశారు. వెంటనే మొబైల్ నంబర్ను కొత్తది తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే కులకచర్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాడు.
చాలా మంది సైబర్ నేరగాళ్లు లింకులు పంపించి లింకు ఓపెన్ చేయడంతోనే డబ్బులు వారికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూస్తున్నారు. ఇటీవల లింగంపల్లి గ్రామానికి చెందిన బాల్రాజ్ ఒక గ్రూప్లో లింక్ పెట్టడంతో ఆ లింకును ఓపెన్ చేయడంతో 30వేల రూపాయలు డ్రా కావడంతో పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ నేరగాళ్ల చేతిలో 2లక్షల 21వేలు పోగొట్టుకున్నా. డిసెంబర్ 31న హైదరాబాద్ వెళ్లా. అక్కడే నా ఫోన్ను కొట్టేసిన సైబర్ నేరగాళ్లు ఫోన్పే ద్వారా 2లక్షల 21వేలు డ్రాచేసుకున్నారు. వెంటనే సైబర్ సైబర్ క్రైమ్కు సమాచారం ఇచ్చినా, పోలీసులను ఆశ్రయించినా, మొబైల్ సిమ్ను కొత్తది తీసుకున్నా లాభం లేకుండా పోయింది. ఫోన్ ద్వారా నా ఖాతాలో ఉన్న డబ్బులను ఖాళీ చేశారు. ఫోన్ కొట్టేసిన ఒక్క రోజులోనే నా డబ్బులను నేరగాళ్లు కొట్టేశారు. డబ్బులను సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే విధంగా సైబర్ క్రైమ్ అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఎర్ర విష్ణువర్ధన్రెడ్డి, కులకచర్ల
బ్యాంకు సిబ్బంది పాస్వర్డ్ ఎప్పుడూ అడగరు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి లావాదేవీల్లోనూ అప్రమత్తంగా ఉంటేనే నేరాలు తగ్గించడం జరుగుతుంది. ఏ బ్యాంకు అధికారైనా పాస్వర్డ్ వివరాలు చెప్పాలని అని అడిగితే ఎందుకని ప్రశ్నించాలి. ఎలాంటి అనుమానం వచ్చినా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతాను సరిచూసుకోవాలి. వివరాలు తెలుసుకొని మీ ఖాతాలో ఉన్న నగదు విత్డ్రా చేస్తే వెంటనే సమాచారం అధికారులకు తెలుపాలి. ఫోన్ పోయిన వెంటనే ఖాతాలో ఉన్న డబ్బులను హోల్డ్లో పెట్టించాలి. లేదంటే ఖాతాను బ్లాక్ చేయించాలి.