కేశంపేట, జనవరి 21: మండలంలోని మట్టి రోడ్లు బీటీ రోడ్లుగా మారాయి. మండలంలోని గ్రామాల మీదుగా రెండు ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. షాద్నగర్ నుంచి కొత్తపేట వయా కడ్తాల్ వరకు రోడ్డును మూడు సంవత్సరాల క్రితమే 48 కోట్ల రూపాయలతో 36 కిలోమీటర్ల మేరా రెండు లేన్ల రహదారి నిర్మాణం జరిగింది. షాద్నగర్ నుంచి కేశంపేట వయా ఆమనగల్లు పట్టణానికి వెళ్లే రెండు లేన్ల రహదారిపై 30 కిలోమీటర్ల రీ-బీటీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రూ. 21.75 కోట్లు మంజూరు చేయించారు. ఇటీవల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. కొత్తూరు మండలంలోని జాండగూడెం నుంచి మండలంలోని కొత్తపేట వరకు సుమారు 20 కోట్ల రూపాయలతో రెండు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అదేవిధంగా మండలంలోని మట్టి రోడ్లు ఉన్న చౌలపల్లి-మీనమోనిపల్లి, బొదునంపల్లి-లేమామిడి, వేములనర్వ-చింతకుంటపల్లి వయా ఎక్లాస్ఖాన్పేట గ్రామాల మ ధ్య కోట్లాది రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. రోడ్లు బాగుండటంతో వ్యవసాయం, పాలు, కూరగాయలు సాగు చేసే రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించుకునేందుకు సులభతరమైంది. మండలంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం జరిగి ప్రజలు, వాహనదారులకు రవాణా సౌకర్యాలు మెరుగవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలానికి సుమారు 140 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చిన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఎమ్మెల్యే కృషితోనే అభివృద్ధ్ది
గ్రామాల రోడ్లను బాగు చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పట్టుదలతో నిరంతరం సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు. గతంలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా గుంతలమయంగా మారిన మట్టి రోడ్లతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కృషి వల్ల ప్రతి రోడ్డు బాగు పడి ప్రజల ఇబ్బందులు తొలిగిపోయాయి. ముఖ్యంగా జాండగూడెం-సిద్దాపూర్ మీదుగా కొత్తపేట వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన రెండు లేన్ల రోడ్డు శరవేగంగా సాగుతోంది. ఈ రోడ్డుతో కేశంపేట మండల ప్రజలకు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణం సాఫీగా సాగుతుంది.
– నవీన్కుమార్, సర్పంచ్, కొత్తపేట
ఇబ్బందులు తొలిగిపోయాయి
చౌలపల్లి గ్రామ పరిధిలోని మీనమోనిపల్లికి రోడ్డు బాగా లేక చాలా ఏండ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల రెండు గ్రామాల మధ్య రోడ్డును బీటీగా మార్చడంతో ప్రజల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఈ ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన వసతులు సమకూరి చాలా సంతోషంగా ఉన్నారు. మీనమోనిపల్లి ప్రజల ఇబ్బందులు తొలిగిపోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– యాదగిరియాదవ్, చౌలపల్లి గ్రామస్తుడు .