సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్లు చస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవం జరుపుకొంటున్నదని తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఆటో డ్రైవర్లతో డిసెంబర్లో చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ధర్నాచౌక్లో తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రవిశంకర్, సమ్మయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన రవాణా వాహనాల ఇన్సూరెన్స్ 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. నగరంలోకి గూడ్స్ వాహనాల అనుమతి సమయం పెంచాలని, వన్ నేషన్, వన్ ట్యాక్స్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారులపై ప్రభుత్వ చెక్పోస్ట్లు ఎత్తివేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్న రెడ్ అంబులెన్స్, గూడ్స్ వాహనాల ఉపాధి దెబ్బతీస్తున్న పోర్టర్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలన్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల రూపంలో డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నందకిశోర్, మంద రవి కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.