ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 24 : శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కట్టుబడి పని చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ 3వ బెటాలియన్లో ఆయుధ కర్మాగారం, క్యాంటిన్, మెన్ బ్యారెక్స్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, యువతులపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా ఉండేందుకు షీ టీమ్ పని చేస్తున్నదన్నారు.
గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ కృషి చేస్తున్నదన్నారు. 3వ బెటాలియన్లో పూర్తి చేసిన ఆయుధ కర్మాగారంతో పాటు కొనసాగుతున్న పలు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం 3వ బెటాలియన్ ఆవరణలో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ విజయ్కుమార్, ఐజీపీ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సైదిక్యూ, చీఫ్ ఇంజినీర్ తులసిదార్, కమాండెంట్ వేణుగోపాల్, అడిషనల్ కమాడెంట్ సురేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.