సీఎం కేసీఆర్ అంటేనే వాక్ప్రవాహం.. ఆయన మాట్లాడడం మొదలు పెడితే.. లక్షలమంది ప్రజలు మంత్ర ముగ్ధులై వినాల్సిందే.. భాషపై పట్టు, యాసపై ప్రేమ, పురాణ ఇతిహాసాలపై అపార పరిజ్ఞానం, సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సాగే ప్రసంగానికి మంత్రముగ్ధులు కానివారుండరు.. కళా పోషకుడు, స్వయంగా కవి అయిన సీఎం కేసీఆర్ తమ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కవులు, పండితులు, రచయితలు తెలుపుతున్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో తమను సన్మానించడమే అందుకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా చరిత్రలో నిలిచేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి, మన సాహిత్యం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఆయనదేనన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు, జాతరలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తి సుపరిపాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ పరిగి, సెప్టెంబర్ 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై సబ్బండ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. జిల్లాకు చెందిన కవులు, రచయితలు కూడా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని, దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి, దేశమంతా తెలంగాణవైపు చూసేలా అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ దేశమంతా అమలు చేసి, పేద ప్రజలకు అందించాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే సీఎం కేసీఆర్ సమర్ధుడని కవులు, రచయితలు పేర్కొంటున్నారు.
కళలను ప్రోత్సహించే నాయకుడు
సీఎం కేసీఆర్..
కళలను ప్రోత్సహించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇలాంటి నేతలు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని కవులు, రచయితలు అభిప్రాయపడుతున్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత, ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమై సాధించిన తెలంగాణను ఒక విజన్తో అభివృద్ధి చేస్తున్నారని వారు కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో న భవిష్యత్ అనే విధంగా నిర్వహించి తెలుగు కవులు, పండితులు, రచయితలను గౌరవించారని, మహాసభల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ప్రాంతం రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగిడి 75 వసంతాలు జరుపుకొంటున్న సందర్భంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా కవులు, రచయితలను సన్మానించడం, దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ తెలుగు సాహితీ పరిమళాలు మరింత విరజిల్లేలా కృషి చేస్తున్నారని అన్నారు.
కవులు, పండితులను ఆదరించిన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, తెలంగాణ మోడల్ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు జరుగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ దేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో నిలుపుతారని వారు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ఆరంగేట్రం చేయాలని, దేశ ప్రధాని కావాలని కవులు, కళాకారులు, రచయితలు కోరుతున్నారు.
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్..
ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలోని బీజేపీ అసమర్థ పాలనతో దేశం ఆగమవుతున్నది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వతహాగా మంచి వక్త అయిన కేసీఆర్ అనేక పుస్తకాలు చదివి అపార జ్ఞానాన్ని సముపార్జించారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలువడం ఖాయం.
– బోడ చంద్రప్రకాశ్, రచయిత ఇబ్రహీంపట్నం
దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే..
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశ ప్రజలకు మెరుగైన సేవలందుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలు దేశానికి రోల్ మాడల్గా ఉన్నాయి.
– కొంకని విజయ్కుమార్, కళాకారుడు (ఇబ్రహీంపట్నం)
సీఎం కేసీఆర్తోనే దేశ ప్రగతి సాధ్యం..
బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని అయితేనే సాధ్యం. ఇలాంటి సమయంలో సామాన్యుల సమస్యలను అర్థం చేసుకునే నాయకుడి సేవలు దేశానికి అవసరం. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది.
– కొంతం యాదిరెడ్డి, ప్రముఖ కవి, కళాకారుడు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
భావితరాలు బాగుపడుతాయి..
ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుని ఆదుకుంటున్నారు. కవులు, కళాకారులు, రచయితలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలను సమాన దృష్టితో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. ఆయన ప్రధాని అయితే భావితరాలు బాగుపడుతాయి.
– దొడ్ల ప్రభాకర్ గౌడ్, రచయిత, తెలంగాణ ఉద్యమ కారుడు, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే..
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తమైతే పేద ప్రజలు బాగుపడుతారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది.
– ఇటుకాల నర్సింహులు, కవి, తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
విజన్ ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ వంటి విజన్ ఉన్న మహానేత సేవలు దేశానికి అవసరం. పల్లెల్లో సమస్యలు, వ్యవసాయ రంగంపై మంచి పట్టు ఉన్న రైతుబిడ్డ సీఎం కేసీఆర్. మన రాష్ట్ర తరహాలోనే దేశ వ్యాప్తంగా వ్యవసాయం రంగంలో మార్పులు రావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి. ప్రస్తుత తరుణంలో దేశానికి కేసీఆర్ సేవలు ఎంతో అవసరం.
– గంగిరెడ్డి, రచయిత, సామాజికవేత్త
దేశమంతటా ఇదే అభివృద్ధి..
సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివృద్ధి చెందుతుంది. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించాలి. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశ ప్రజలకు అందాలి. సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.
– నరేందర్, కవి, ఉపాధ్యాయుడు షాద్నగర్
అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతయ్..
కళాకారులకు తగిన గౌరవం దక్కింది.. రచయితలు, కళాకారులు మరుగున పడుతున్న సందర్భంలో, రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో కళలకు జీవం పోశారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వచ్చి దేశ ప్రధాని అయితే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి.
– ఎల్లికంటి జ్ఞానప్రసూనశర్మ, రచయిత, కడ్తాల్ మండలం
దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలి..
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన పాత్ర పోషించాలి. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి పీవీ నర్సింహారావు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి.
– ద్యావరి నరేందర్ రెడ్డి, ప్రముఖ కవి, పాటల రచయిత, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్ మండలం
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తయ్..
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఎంతో కష్టతరంగా ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో టీఎస్ఐపాస్తో సింగిల్విండో విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటు సులభతరంగా మారింది. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.
– గాజుల పవన్ కుమార్, ప్రముఖ కవి, రచయిత, తాండూరు