భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను నగరంలో సన్మానించగా.. జిల్లాస్థాయిలో ఎంపికైనవారిని కలెక్టరేట్లలో సత్కరించారు. ఉపన్యాసాలు, సన్మానాలు, జ్ఞాపికల ప్రదానంతో కలెక్టరేట్లలో పండుగ వాతావరణం కనిపించింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హాజరై ఉత్తమ గురువులను సన్మానించారు. అదేవిధంగా వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ సమయంలో విద్యార్థులను అప్రమత్తం చేయడంలో టీచర్లు చూపిన చొరవను అభినందించారు. గురువుల మార్గదర్శకంలోనే విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. అనంతరం పలువురు టీచర్లు మాట్లాడుతూ ‘ఉత్తమ’ సత్కారాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా, ఆదిబట్లలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు వర్కాల పరమేశ్ నగరంలోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. కొడంగల్ గిరిజన గురుకుల పాఠశాల ఉత్తమంగా నిలువగా, ప్రిన్సిపాల్ రాష్ట్రస్థాయి అవార్డు పొందాడు. అలాగే చేవెళ్ల మండలంలోని కందవాడ ప్రభుత్వ పాఠశాల స్వచ్ఛతలో సత్తా చాటింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 5, (నమస్తే తెలంగాణ) : ప్రపంచాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 144 మంది ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ఎంతో మంది ఉపాధ్యాయులు గొప్ప గొప్ప పదవులను అధిరోహించిన వారున్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్యులని, ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలను ఓర్చుకొని చదివి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవ చేసిన మహావ్యక్తి అని కొనియాడారు.
అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మనం బతకడంతోపాటు మరికొంత మందిని బతికించాలని, పది మంది కోసం పని చేసిన వారు సమాజంలో మహానుభావులుగా మిగిలిపోతారని, అలాంటి పవిత్రమైన వృత్తిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమాజానికి అవసరమైన ఉన్నత వ్యక్తులను తీర్చిదిద్దుతున్నారన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని మంత్రి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల శాతం పెరుగడం చాలా సంతోషకరమన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆర్థిక సాయాన్ని అందించి భారం లేకుండా చేస్తుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.
నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు
– జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
నవసమాజ నిర్మాణం, సమాజ మార్పు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని, అందువల్ల ఉపాధ్యాయులు గురుతర బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. దేశంలో ఎంతో మంది ఉపాధ్యాయులు గొప్ప గొప్ప పదవులను అధిరోహించిన వారున్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణ ముఖ్యులని, రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవ చేసిన మహావ్యక్తి అని కొనియాడారు.
సమాజాన్ని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ గురువే..
– రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్కుమార్
సమాజాన్ని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ గురువేనని రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్కుమార్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతోపాటు దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణీదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ ఆర్తిక, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్ రావు తదితరులు పాల్గొన్నారు.