వడగండ్ల వానతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి పర్యటించారు. పలు గ్రామాల్లో నష్టం వాటిల్లిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారుగా 2 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. రైతులు ఆందోళనపడొద్దని ఇక్కడి పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా మేలు జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. పంట నష్టానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి వెంటనే ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు.
-మర్పల్లి, మార్చి 17
మర్పల్లి, మార్చి 17 : మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న రైతుల పంటలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి శుక్రవారం మర్పల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
మండల కేంద్రంలోని రవీందర్రెడ్డి, నర్సింహారెడ్డి, సంజీవరెడ్డి, పబ్బే కంతారావు రైతుల పొలాల వద్దకు వెళ్లి టమాట, క్యాబేజీ, మొక్కజొన్న, జొన్న, ఉల్లి పంటలను పరిశీలించి ఎన్ని ఎకరాలు, ఏ పంటలు వేశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే కొత్లాపూర్ గ్రామంలోని తుల్జయ్య, వెంకటేశంగౌడ్ పొలాలను సందర్శించి క్యాబేజీ, మిరప, కూరగాయాల పంటలు, చింత, మామిడి కాయలు రాలిపోయన వాటిని పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యటన చేపట్టామని, రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నర్సరీ వద్ద వడగండ్ల మంచుగడ్డను పరిశీలించారు. వడగండ్ల తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
మర్పల్లి, మోమిన్పేట్ మండలాల్లోని 13 గ్రామాల్లో వడగండ్ల వర్షం తీవ్రత ఎక్కువగా ఉందని, దాదాపు 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పంట నష్టానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందించాలని మంత్రి కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు, ఉద్యానశాఖ సంచాలకులు హన్మంతరావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఆర్డీవో విజయకుమారి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీపీ లలితారమేశ్, జడ్పీటీసీ మధుకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నాయబ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
రూ.5లక్షలు నష్టం వాటిల్లింది..
కొత్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న 5.20 ఎకరాల పొలంలో ఎకరం క్యాప్సికం, 2 ఎకరాలు వంకాయ, 1.20 ఎకరాల్లో ఉల్లిపంట వేశా. పంట మంచిగా ఉంది. ఈ ఏడాది మంచి లాభం వస్తుందని అనుకున్నాను, కానీ గురువారం కురిసిన వడగండ్ల వానకు పూర్తిగా నేలమట్టం అయింది. సుమారుగా రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-వెంకటేశంగౌడ్, రైతు, కొత్లాపూర్
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండు ఎకరాల్లో టమాట, రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశా. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రి, పగలు కష్టపడి పంటను సాగు చేశా. వారంలో టమాట పంట చేతికి వస్తుందనగా గురువారం మధ్యాహ్నం పడిన వడగండ్ల వానకు మొక్కజొన్న, టమాట పంటలు దెబ్బతిన్నాయి. రూ.2 లక్షల 50 వేల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
-ఉగ్గేళ్లి నర్సింహారెడ్డి, రైతు మర్పల్లి