టీచర్ల బదిలీల జాతర షురూ అయ్యింది. ఎట్టకేలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ప్రక్రియను చేపట్టేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఈ నెల 3 నుంచి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి.. అక్టోబర్ నెలాఖరు వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,878 మంది దరఖాస్తు చేసుకోగా.. సవరణలకు ప్రభుత్వం వీలు కల్పించింది. గతంలో దరఖాస్తు చేయనివారికీ అవకాశం కల్పించింది. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా 65 మంది, స్కూల్ అసిస్టెంట్లుగా 129 మంది ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల దిశగా ప్రభుత్వం చొరవ చూపడంపై ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వానికి సుగమం అయ్యింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి.. అక్టోబర్ నెలాఖరు వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,878 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు సవరణలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్గా 65 మంది, స్కూల్ అసిస్టెంట్స్గా 129 మంది ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2018లో చివరిసారిగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఆ తర్వాత కోర్టు కేసుల నేపథ్యంలో బదిలీలు ముందుకు సాగలేదు. తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెనువెంటనే బదిలీల ప్రక్రియను మొదలుపెట్టింది. జిల్లాలో ఎనిమిదేండ్లుగా బదిలీకి నోచుకోని ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. ఇక భార్యాభర్తలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో వీరి ఎదురుచూపులకు తెరపడింది.
ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటాం. 371జీవో ప్రకారం 20% మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారు 1800లకు పైగానే ఉన్నారు. బదిలీల సందర్భంగా చాలామందికి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ లభించనుంది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపడుతాం.
– సుశీందర్రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ జారీ చేసినందుకు ధన్యవాదాలు. బదిలీల కోసం జిల్లాలో ఎనిమిదేండ్లుగా ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. వేర్వేరు చోట్ల పనిచేస్తున్న భార్యాభర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన బదిలీల ప్రక్రియను చేపడుతుండడంతో ఉపాధ్యాయులంతా సంతోషంగా ఉన్నారు. ఈ బదిలీల వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు సైతం లభించనున్నాయి.
– రాజిరెడ్డి, టీఎస్ పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి