మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. గత తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మించింది. దీంతో వానకాలంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1108.20 కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించింది. తొమ్మిదేండ్ల కాలంలో ఆర్అండ్బీ రోడ్లకు రూ.586 కోట్లు, పీఆర్ రోడ్లకు రూ.310 కోట్లను వెచ్చించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చింది. పలుచోట్ల బైపాస్ల నిర్మాణంతో ప్రజలకు దూరభారం తగ్గగా.. చాలావరకు సమయం ఆదా అవుతున్నది. అదేవిధంగా విరివిగా లింకురోడ్ల ఏర్పాటు, గ్రామాల మధ్య ఉన్న వాగులు, కాలువలపై వంతెనలు, కల్వర్టులు నిర్మించడంతో వరదలొచ్చినా ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
రంగారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో మౌలిక వసతుల్లేక తెలంగాణ ప్రజలు గోసపడ్డారు. దారులు, రహదారులు, వంతెనలు, కాలువలపై కల్వర్టులు లేక ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా గతంలో దార్లు సరిగా లేక ఒక ఊరి నుంచి మరొక ఊరికి.. గ్రామాల నుంచి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, నగరాలకు వెళ్లాలంటే ప్రజల కష్టాలు వర్ణణాతీతంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు మంచి రోజులొచ్చాయి. బీఆర్ఎస్ ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలతో గ్రామాలు పట్టణాలకు దీ టుగా అభివృద్ధి చెందుతున్నాయి. మారుమూల గ్రామా లకు కూడా రోడ్డు సౌకర్యం మెరుగైంది.
తొమ్మిదేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వీధివీధికీ సీసీ రోడ్లు.. సింగిల్ రోడ్లుగా ఉన్న వాటిని డబుల్ రోడ్లుగా.. డబుల్ రోడ్లను నాలుగు లైన్ల రహదారులుగా తీర్చిది ద్దారు. జిల్లాలోని 558 గ్రామాలు, 27 మండలాలు, పట్టణాల్లోని పలు రోడ్లను డెవలప్ చేశారు. దీంతో రవా ణా సాఫీగా.. వేగవంతంగా ..గంటల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం రహదారులను తీర్చిదిద్దింది. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మించింది. హైదరాబాద్ మహా నగరానికి ఇబ్రహీంపట్నం నుంచి, శ్రీశైలం రహదారి, షాద్నగర్, చేవెళ్ల, కందుకూ రు మొదలైన రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ ప్రధాన కేంద్రాల నుంచి గతంలో గంటల కొద్దీ సమయం పట్టేది. కానీ.. ప్రభుత్వం రోడ్లను విస్తరించడంతో సమయం తగ్గి ప్రయాణం వేగం పెరిగింది.
రోడ్లు, భవనాల శాఖ ఈ తొమ్మిదేండ్ల కాలంలో 1,108. 20 కి.మీ మేర జిల్లాలోని పలు రోడ్లను విస్తరించింది. ప్రయాణం సాఫీగా.. వేగవంతంగా సాగేలా అధికారులు రోడ్లను తీర్చిదిద్దారు. ఇందులో రాష్ట్ర రహదారులు 66. 50 కి.మీ, మేజర్ జిల్లా రహదారులు 630.22 కి.మీ కాగా, గ్రామీణ రహదారులు 411.480 కి.మీ మేర విస్తరించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం, జిల్లాకు మొ త్తం 164 పనులు మంజూరయ్యాయి. 989.48 కి.మీ రోడ్డు పొడవుకు రూ.1,808.78 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసి 121 పనులను పూర్తి చేసింది. కాగా 207.48 కి.మీ పొడవు పనులు మిగిలి ఉండగా..43 పనులు పురోగతిలో ఉన్నాయి. ఆ పనుల పూర్తి కోసం రూ.560 కోట్లు వెచ్చిస్తున్నది. గత తొమ్మిదేండ్లలో చేవెళ్ల ఆర్అండ్బీ రోడ్లకు రూ.586 కోట్లు ఖర్చు చేయగా.. పీఆర్ రోడ్లకు ప్రభుత్వం రూ.310 కోట్ల్లను వెచ్చించింది.
హయత్నగర్ నుంచి అనాజ్పూర్ రోడ్డును 8కి.మీ మేర రూ.24 కోట్లతో విస్తరించారు. ఇబ్రహీంపట్నం నుంచి ఎన్హెచ్-9 రహదారి ద్వారా దండుమైలారానికి వెళ్లే మార్గంలో 7 కి.మీ, 15 కి.మీ, 19 కి.మీ రూ.24.60 కోట్లతో బ్లాక్స్ కల్వర్టులను నిర్మించారు. పెద్ద అంబర్పేట నుంచి కవాడిపల్లి వరకు 6.5 కి.మీ మేర రూ.7.80 కోట్లతో.. హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ వరకు 10 కి.మీ మేర రూ.14.670 కోట్లతో రోడ్డును వెడల్పు చేశా రు. అదేవిధంగా కందుకూరు నుంచి కోళ్లపడకల్ వరకు వయా కొత్తగూడ, జైతవరం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, పోరండ్లకు 16 కి.మీ మేర రూ.16.కోట్లతో రోడ్డు వెడల్పు చేశారు. మహేశ్వరం గేట్ నుంచి తిమ్మాపూర్కు సీసీరోడ్డు6 నుంచి 7 కి.మీ మేర పనులను రూ. 25 కోట్లతో పూర్తి చేశారు. ఇంకా ఇదే ప్రాంతంలో ఐదు నుంచి 8కి.మీ మేర విస్తరణ పనులకు రూ.48.5 కోట్లతో చేపట్టారు. చేవెళ్ల-అంధాపూర్ పరిధిలో 9 నుంచి 10 కి.మీ మేర పనులను రూ.10.50 కోట్లతో.. హిమాయత్నగర్ నుంచి తంగడ్పల్లి రోడ్డుకు కి.మీ మేర పనులను రూ.11.8 కోట్లతో.. కేతిరెడ్డిపల్లిలో 2 నుంచి 5, 3 నుంచి 5 కి.మీ మేర పనులను రూ.88.లక్షలతో పూర్తి చేశారు. హిమాయత్నగర్ నుంచి తంగడ్పల్లి రోడ్డు వరకు 29 కి.మీ మేర చిన్న వంతెనల నిర్మాణం రూ.3.35 కోట్లతో పూర్తైంది. హిమాయత్నగర్ నుంచి తంగడ్పల్లి రోడ్డుకు 10 కి.మీ మేర వరద నష్టం మరమ్మతులను రూ.2.85 కోట్లతో.. శంషాబాద్ నుంచి హిమాయత్సాగర్ వరకు 2.5 కి.మీ మేర రూ.30.లక్షలతో రహదారికి మరమ్మతులు చేశారు. జేపీ దర్గా గేట్ నుంచి జేపీ దర్గా వరకు 10 కి.మీ మేర సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు రూ.60లక్షలను వెచ్చించారు. జా తీయ రహదారి 44 నుంచి మామిడిపల్లి వరకు 10 కి.మీ మేర రో డ్డును రూ.90లక్షలతో పూర్తి చేశారు. కల్వకుర్తి-మాదారం-కడ్తాల్ రోడ్డు 26 కి.మీ. నుంచి 42 కి. మీ మేర రూ. 20.40 కోట్లతో పూర్తి చేశారు. ఇంకా పలు పనులు పురోగతిలో ఉన్నాయి.
గతంలో రోడ్లు గతుకుల మయంగా ఉండేవి. కానీ.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రోడ్లు బాగుపడ్డాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లు మంచిగా మారాయి. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా తీసుకెళ్తున్నాం. వానకాలంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తున్నాం.
– బేగరి సత్తయ్య, ఆటో డ్రైవర్, అంతారం, చేవెళ్ల మం
తెలంగాణ ఏర్పడి.. సీఎం కేసీఆర్ పాలన వచ్చిన తర్వాతే గ్రామాలు, మండలాలు, పట్టణాలు అభివృద్ధిలో ముందున్నాయి. జిల్లాలోని 558 గ్రామాల్లో చాలా వరకు రోడ్లు ఇప్పటికే బాగుపడ్డాయి. వీధుల్లో సీసీ రోడ్లు, గ్రామీణ, మండలాలు, జిల్లా రోడ్లను ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి విస్తరించింది. జిల్లాలో 1,108.20 కి.మీ మేర రోడ్లను విస్తరించి.. ప్రయాణికులకు ప్రయాణం సాఫీగా. వేగంగా.. సౌకర్యవంతంగా సాగేలా చర్యలు తీసుకున్నాం. – శ్రావణ్ప్రకాశ్, ఈఈ, ఆర్ అండ్ బీ విభాగం, రంగారెడ్డి జిల్లా