మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. అందుకోసం కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్లను పునరుద్ధరిస్తున్నది. అలాగే అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా అంతర్గత రోడ్లను మెరుగుపర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 385 సీసీరోడ్లు, ఒక మెటల్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికోసం ప్రభుత్వం రూ.32.89కోట్లను మంజూరు చేయగా.. పనుల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రహదారుల నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేసే దిశగా డీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణను రూపొందించారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 9 : గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాలకు సీసీ రోడ్లను మంజూరు చేస్తున్నది. ఈ ఏడాది కూడా వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయడానికి డీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
గ్రామాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఏసీడీఎఫ్), ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇవే కాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో కూడా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇలా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండేవి. వర్షాకాలం వస్తే చాలు రోడ్లన్నీ బురదగా మారి ప్రజలు నడవడానికి నానా అవస్థలు పడేవారు. తెలంగాణా వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారు.
నాలుగు సంవత్సరాల కిందట 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించడంతో వాటికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాలకు అనుబంధంగా ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన తండాలు నేడు సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. సీసీ రోడ్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బషీరాబాద్ మండలానికి రూ.1.93 కోట్లు, బొంరాస్పేటకు రూ.3.29 కోట్లు, చౌడాపూర్కు 1.20 కోట్లు, దోమకు రూ.3.70 కోట్లు, దౌల్తాబాద్కు 2.75 కోట్లు, కొడంగల్కు రూ.2.66 కోట్లు, కోట్పల్లికి రూ.50 లక్షలు, కులకచర్లకు రూ.3.35 కోట్లు, మోమిన్పేటకు రూ.40 లక్షలు, నవాబుపేటకు రూ.90 లక్షలు, పరిగికి రూ.2.45 కోట్లు, పెద్దేముల్కు రూ.2.20 కోట్లు, పూడూరులో సీసీ రోడ్లకు రూ.3.25 కోట్లు, ఒక మెటల్ రోడ్డుకు రూ.20 లక్షలు, తాండూరుకు రూ.2 కోట్లు, యాలాల మండలానికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంజూరైన పనుల్లో ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించి పనులు చేపడుతున్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో అంతర్గత రహదారులు బాగుపడుతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో వర్షం పడితే రోడ్లు బురదగా మారి నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ప్రతి ఏటా ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి.
– కావలి నారాయణ, మెట్లకుంట సర్పంచ్
ఉపాధి హామీ పథకం ద్వారా మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.17 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులను ప్రారంభించాం. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కృషితో బురాన్పూర్ గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చాయి. నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు.
– లక్ష్మి, బురాన్పూర్ సర్పంచ్
తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తరువాతనే అభివృద్ధి కనిపిస్తున్నది. తండాలకు ఉపాధి హామీ నిధులతోపాటు గ్రామ పంచాయతీ నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎమ్మెల్యే మా తండాలో సీసీ రోడ్లకు రూ.16 లక్షలు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు.
– లక్ష్మణ్నాయక్, బాపన్చెరువుతండా