రంగారెడ్డి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఆసక్తిగలవారికి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద సబ్సిడీ రుణాలు అందించి ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. ఇప్పటికే మహిళా సంఘాలను ప్రోత్సహించి నెలకొల్పిన ఆహార ఉత్పత్తుల శుద్ధి యూనిట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు పెరుగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో 2021 సంవత్సరంలో జిల్లా పరిశ్రమల, గ్రామీణాభివృద్ధి శాఖలు 95 యూనిట్లను ఏర్పాటు చేయించి, రూ.37.19లక్షల రుణాలను అందించాయి. 2022, 2023 సంవత్సరానికిగాను 256 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 40 యూనిట్లు ఏర్పాటయ్యాయి. మిగిలిన యూనిట్ల స్థాపనకు ఆసక్తిగలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ ఆహ్వానిస్తున్నది.
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద సబ్సిడీ రుణాలు అందించి ఆర్థిక చేయూతను కల్పిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 2021లో జిల్లా పరిశ్రమల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు 95 యూనిట్లను ఏర్పాటు చేయించి రూ.37.19 లక్షల రుణాలను అందజేసింది. 2022-23 సంవత్సరానికి 256 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 40 యూనిట్లు ఏర్పాటయ్యాయి. మిగిలిన యూనిట్ల స్థాపనకు ఆయా శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్తీలేని ఆహారాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు, తక్కువ ధరలకే వినియోగదారుడికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నంతో.. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు.. ఆయా కుటుంబాల ఆర్థిక వృద్ధి సైతం పెరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
యూనిట్లతో సత్ఫలితాలు
వివిధ వర్గాల ప్రజానీకానికి ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే స్వయం సహాయక సంఘాలలోని మహిళలతో ఏర్పాటు చేసిన యూనిట్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఆయా యూనిట్లు పొందిన మహిళలు సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆహార ఉత్పత్తుల శుద్ధి యూనిట్లను మరింతగా విస్తరించే దిశగా జిల్లా పరిశ్రమల శాఖ కృషిచేస్తున్నది. ప్రధానమంత్రి ఫార్మాలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్(పీఎంఎఫ్ఎంఈ)లో ఈ ఏడాది లక్ష్యం 256 యూనిట్లకు 40 యూనిట్లను ఏర్పాటు చేయగా.. మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగల వివిధ వర్గాల నుంచి దరఖాస్తులను పరిశ్రమల శాఖ ఆహ్వానిస్తున్నది. గరిష్టంగా రూ.కోటి రుణ సదుపాయం కల్పించేలా ఐదేండ్ల గరిష్ట ప్రణాళికతో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది.
స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం
స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఆయా ఉత్పత్తులతో కూడిన యూనిట్లకే పీఎంఎఫ్ఎంఈ స్కీంలో ప్రాధాన్యత కల్పిస్తున్నది. బేకరీ ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సిట్రస్, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, మొక్కజొన్న, పాలు, వేరుశనగ, పుట్టగొడుగు, నూనె గింజలు, బియ్యం, పండ్లు ఆధారిత ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, చెరుకు, కూరగాయల ప్యాకింగ్తోపాటు కూరగాయల ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని పరిశ్రమల శాఖను సంప్రదించవచ్చు.
యూనిట్ల ఏర్పాటు దిశగా చర్యలు
– జె.రాజేశ్వర్రెడ్డి, జనరల్ మేనేజర్, రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ
గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అత్యధిక యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల ఏర్పాటు చేసిన యూనిట్ల కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపర్చాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేర్చేలా ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. స్వయం శక్తితో ఎదగడంతోపాటు పది మందికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగపర్చుకోవాలి.
నెలకు రూ.50వేలకు పైగా సంపాదన
– దారం శ్వేత, లబ్ధిదారు, శంకర్పల్లి
గత ఏడాది పీఎంఎఫ్ఎంఈ పథకంలో రూ.36.30 లక్షలు మంజూరయ్యాయి. స్థానికంగా కుసుమ పంటను రైతులు ఎక్కువగా సాగు చేయడం వల్ల కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నాం. కుసుమల నుంచి నూనెను తీశాక వ్యర్థాలను కోళ్ల దానకు అమ్ముతున్నం. సీజన్లో నెలకు అన్ని ఖర్చులుపోను రూ.50వేలకు పైగా మిగులుబాటు అవుతున్నది. మా కుటుంబానికి ఇదే ఉపాధి. ఈ యూనిట్తో మరో ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.