రంగారెడ్డి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : మాటలనే పాటలుగా మలిచి.. ప్రజా యుద్ధనౌకగా అందరి హృదయాల్లో నిలిచి..పొడుస్తున్న పొద్దు మీద..పాటై వెలిగి..స్వరాష్ట్ర చైతన్యాన్ని నింపి…తెలంగాణ ఉద్యమానికి వన్నెలద్దిన ప్రజాగాయకుడు గద్దర్కు యావత్ ప్రజానీకం కన్నీటి వీడ్కోలు పలికింది. సోమవారం అల్వాల్లోని మహాబోధి పాఠశాల ప్రాంగణంలో గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. అంతకుముందు ఎల్బీస్టేడియంలో గద్దర్ భౌతికకాయాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖులు, కవులు, కళాకారులు, అభిమానులు కడసారి చూసి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడి నుంచి భూదేవినగర్లోని నివాసానికి గద్దర్ పార్థివదేహం చేరుకుంది. అక్కడ సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన గద్దర్ అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మహాబోధి పాఠశాల ఆవరణలో గద్దర్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
నివాళులర్పించిన మంత్రులు, ప్రముఖులు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, శ్రీధర్బాబు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నేతలు పరిటాల శ్రీరాం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార, మాణిక్రావ్ ఠాక్రే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ హన్మంతరావు, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, విమలక, ప్రముఖ గాయకుడు యశ్పాల్, ప్రముఖ కవి భీమసేన, దైవజ్ఞశర్మ, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, మోహన్బాబు, మనోజ్, నాగబాబు, నిహారిక, అలీ, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్తో పాటు అనేక మంది కవులు, కళాకారులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.