వికారాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతూ మందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది నుంచి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రారంభించడం, నాణ్యమైన విద్యనందించడంతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాంలను కూడా అందిస్తుండడం వంటి కార్యక్రమాలను గత తొమ్మిదేండ్లుగా చేపడుతూ వస్తున్నది. అన్ని వసతులతో కూడిన గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, జడ్పీ పాఠశాలల బలోపేతానికి కూడా సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు
మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున బడులను ఎంపిక చేసి సంబంధిత స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి పనులు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 41 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తికాగా, ఇప్పటికే 10 స్కూళ్లను ప్రారంభించగా, మరో 23 స్కూళ్లను నేడు జిలాల్లోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి. ఇప్పటివరకు 41 స్కూళ్లలో దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా స్కూళ్లలో 50 శాతానికిపైగా పనులు పూర్తి కావడంతోపాటు ఆయా స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అంచనాలు పూర్తయిన 371 స్కూళ్లలో మౌలిక సదుపాయల పనులను చేపట్టేందుకు ఇప్పటివరకు జిల్లాకు రూ.144 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
గత సంవత్సరం ఆగస్టు 15 నుంచి ‘తొలిమెట్టు’ అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో చదివే విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ గత విద్యా సంవత్సరం ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు(ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేసింది. జిల్లాలోని 72 మంది రిసోర్స్ పర్సన్లకు ఈ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 767 ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి.
డిజిటల్ బోధన
మొదటి విడతలో ఎంపిక చేసిన 111 ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంచడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఇందుకుగాను మల్టిఫుల్ ఫీచర్స్ డిజిటల్ స్క్రీన్ డివైజ్లను ఏర్పాటు చేస్తున్నారు. 75 అంగుళాలున్న స్క్రీన్లను 8, 9, 10 తరగతులకు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఇంటర్నెట్, వైఫై, మొబైల్ హాట్స్పాట్ సదుపాయం కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియోలు, త్రీడీ ఇమేజ్లను గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ స్క్రీన్ను మూసివేస్తే గ్రీన్చాక్ బోర్డులా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. మొబైల్ నుంచి ఈ డివైజ్కు వీడియోలు కూడా పంపించుకోవచ్చు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
పదో తరగతిలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్నది. ఈ పథకం కింద ఆయా కులాల రిజర్వేషన్ ఆధారంగా కేటాయించిన సీట్లను భర్తీచేస్తారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.35 వేలు ఫీజు, పాకెట్ మనీగా ఏడాదికి రూ.3 వేలు అందిస్తారు. దీంతోపాటు ప్రవేశం పొందిన కళాశాలలోనే ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి కూడా కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీలైతే రూ.లక్షకు మించనివారు, విద్యార్హతలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 7.0-10 జీపీఏ మార్కులు సాధించి ఉండాలి.
ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాంను అందజేస్తుండగా ఈ ఏడాది నుంచి ఉచితంగా నోటు పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నది. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, యూనిఫాంను అందజేశారు. త్వరలో నోటు పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారు.
మారిన మధ్యాహ్న భోజనం మెనూ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకం మెనూను ప్రభుత్వం ఈసారి మార్చింది. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒక రోజు కిచిడీ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం పూట ఏమీ తినకుండా వస్తారన్న ఉద్దేశంతో ఉదయం రాగిజావను అల్పాహారంగా అందించాలని నిర్ణయించింది. నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
జిల్లాకు 33 గురుకుల పాఠశాలలు
కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం జిల్లాలో గత తొమ్మిదేండ్లలో 33 ప్రభుత్వ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. సంబంధిత గురుకుల పాఠశాలల్లో ఇంటర్ వరకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు 15,491 మంది పేద విద్యార్థులకు అవకాశం కల్పించారు. గురుకుల పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.30 లక్షలను ఖర్చు చేస్తున్నది.