కూలీలను వ్యాపారులుగా.. కార్ల డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన ఘనత ‘దళితబంధు’ది. ఏదో దొరికిన పని చేసుకుని ఉపాధి పొందే దళితులను నేడు మరో నలుగురికి పని కల్పించే స్థాయికి ఎదిగేలా చేసిన పథకం. అప్పులు తీసుకునే దుస్థితి నుంచి అప్పులిచ్చే ఆర్థిక స్థోమతనిచ్చిన కల్పతరువు దళితబంధు. ఇవేవి మింగుడు పడని ‘ఆంధ్రజ్యోతి’ అక్కసును వెళ్లగక్కుతూ విజయవంతంగా సాగుతున్న దళితబంధుపై బురదజల్లే యత్నం చేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో తొలివిడుతలో దళితబంధుకు సంబంధించి వందశాతం గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తికాగా, ఎంతోమంది లబ్ధిదారులు వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 697 యూనిట్లకుగాను రూ.69.70 కోట్ల నిధులు మంజూరుకాగా ఎంతోమంది మెరుగైన జీవనోపాధి పొందుతున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో మొదటి దఫాలో 358 యూనిట్లు మంజూరుకాగా, రూ.35.80 కోట్లు వెచ్చించి లబ్ధిదారులకు వ్యాపార అవకాశాలు కల్పించారు.
పలువురు కిరాణం, వెల్డింగ్, పిండి గిర్నీలు, లేడీస్ కార్నర్ తదితర దుకాణాలు ఏర్పాటు చేసుకొని దర్జాగా బతుకుతున్నారు. రెండో విడుతలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 500 యూనిట్లు మంజూరు కాగా, గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి నిప్పులాంటి నిజాలను పట్టించుకోని ‘జ్యోతిలక్ష్మి’ తన అసత్యపు రాతలతో విషం చిమ్ముతున్నది. మరోవైపు ‘జ్యోతిలక్ష్మి’ పిచ్చి రాతలపై జనం మండిపడుతున్నారు. పథకాలను ప్రజలకు చేరవేసేలా వార్తలుండాలె.. గానీ ఉనికిని కాపాడుకునేందుకు ఇంత నీచానికి దిగజారడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వికారాబాద్, జనవరి 21, (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందిన వారు.. దళితబంధు పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందజేయడంతో రూ.10 లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు ఉపాధి పొందుతున్నారు. దళితబంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పని చేసినవారు నేడు ఓనర్లుగా, రోజువారీ కూలీలు యజమానులుగా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు.
ఈ యూనిట్లకు సంబంధించి ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. ఎంచుకున్న వ్యాపారాల్లో నష్టపోతే వారిని ఆదుకునేందుకుగాను రక్షణ నిధి కింద ఇప్పటి వరకు రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల కాగా, జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది.
జిల్లాలో మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరు నియోజకవర్గంలో 100, పరిగి నియోజకవర్గంలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు మొదటి విడుతలో ఆయా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారైన దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
రెండో విడుతపై కసరత్తు..
రెండో విడుత దళితబంధుకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు కసరత్తు జరుగుతున్నది. పైలట్ ప్రాజెక్టు నిర్వహణ సమయంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా కొత్తగా గైడ్లైన్స్ను ప్రభుత్వం తయారు చేస్తున్నది. మొదటి విడుతలో ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ ఉండగా, రెండో విడుతలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకుగాను ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అర్హులైన వారు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనున్నది. త్వరలో స్పష్టమైన ఆదేశాలను జారీ చేయనున్నది. తదనంతరం దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగనున్నది.
రంగారెడ్డి జిల్లాలో మొదటి కింద 697 యూనిట్లు..
రంగారెడ్డి, జనవరి 21(నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దళితులకు జీవనోపాధిని చూపిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఊతమిస్తూ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల విస్తరణకు తోడ్పాటును ఇస్తున్నది. ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తున్నది. ఇందులో నుంచి రూ.10 వేలను రక్షణ నిధికి కేటాయిస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులను ఎమ్మెల్యే ద్వారా ఎంపిక చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మొదటి విడుత కింద 697 యూనిట్లు మంజూరు కాగా, గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లకు గాను వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను జమ చేసింది. చేవెళ్ల నియోజకవర్గంలో 82 యూనిట్లు, కల్వకుర్తిలో 62, ఎల్బీనగర్లో 81, మహేశ్వరం, రాజేంద్రగనగర్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజకవర్గాల్లో 100, శేరి లింగంపల్లి నియోజకవర్గంలో 72 యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం 69.70 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందులో ఒక్కో యూనిట్ నుంచి రూ.10 వేల చొప్పున రక్షణ నిధికి కేటాయించారు. రెండో విడుత కింద నియోజకవర్గానికి 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇప్పుడు సొంత కారుతో ఉపాధి పొందుతున్నా..
నేను గతంలో అద్దె కారుతో హైదరాబాద్ నగరంలో కారును నడిపేది. అప్పట్లో కారు రెంట్ పోను పెద్దగా మిగిలేది కాదు. ఇంకా ప్రైవేటు ఉద్యోగం కూడా చేసేవాడిని. నెలకు రూ.10 వేలు కూడా వచ్చేవి కావు. ఒక్కోసారి కుటుంబ ఖర్చులకూ ఇబ్బంది అవుతుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళిత బంధు ద్వారా సీఎం కేసీఆర్ కారును ఇప్పిచ్చిండు. ఇప్పుడు అద్దె టెన్షన్ లేదు. ఈఎంఐ టెన్షనూ లేదు. అన్ని ఖర్చులు పోను రోజుకు కనీసం రూ.వెయ్యి మిగులుతున్నాయి. నెలకు రూ.25 వేలకు పైగా సంపాదిస్తున్నా. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.
-వెంకటేశ్, రేగడి చిల్కమర్రి, కొందుర్గు మండలం
ఇంటిల్లిపాదికి టెంట్హౌస్తో ఉపాధి..
ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ గ్రామం. మాకు సరిపడా పొలంలేక ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసేది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధులో మా కుటుంబాన్ని ఎంపిక చేశారు. దీంతో రూ.10లక్షల ఆర్థిక సాయం అందింది. ఇబ్రహీంపట్నంలో టెంట్హౌస్ ఏర్పాటు చేసుకున్నా. మా కుటుంబానికి ఉపాధి లభిస్తున్నది. మా తండ్రి, నేను, మా తమ్ముడు ముగ్గురం టెంట్హౌస్ పని చేస్తున్నాం. దళితబంధు మా కుటుంబంలో వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పీ రాజ్కుమార్, ఇబ్రహీంపట్నం
దళిత బంధుతో ఆర్థిక ఎదుగుదల..
దేశంలో ఎక్కడ లేని విధంగా దళితబంధు పథకం అమలవుతున్నది. ముందుగా పేద దళితులకు రూ. 10లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఉపాధి కల్పించడం సంతోషకరం. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్గా వినియోగించుకున్నాయి తప్ప పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణ సర్కార్ దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– లక్ష్మణ్, లింగారెడ్డిగూడ గ్రామం,ఫరూఖ్నగర్ మండలం
దళితబంధుతో లాభదాయకం..
దళితబంధు పథకం ద్వారా దళితులకు ఎంతో లాభదాయకం. తాను ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో టెంట్హౌస్ కోసం దరఖాస్తు చేసుకున్నా. రూ.10 లక్షల సాయంతో టెంట్హౌస్ పెట్టుకున్నా. అద్భుతమైన దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు దళితులంతా రుణపడి ఉంటారు. టెంట్హౌస్తో ఇప్పటికీ రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది.
– పరిగి మాణిక్యం, నస్కల్ పరిగి మండలం
సీఎం కేసీఆర్ వల్లే బతుకుల్లో వెలుగులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నా జీవితానికి, మా కుటుంబానికి దారి చూపించిన దేవుడు. దళిత బంధు ద్వారా నాకు ఉపాధి మార్గాన్ని కల్పించిన్రు. రూ.10 లక్షలతో చిరు పారిశ్రామిక వేత్తగా ఉపాధి పొందుతున్నా. మరో పది మందికి ఉపాధి కల్పించేలా నన్ను తీర్చిదిద్దిన్రు. ప్రస్తుతం నేను ఇటుకలు తయారు చేసే చిన్నపాటి వ్యాపారం చేస్తున్నా. దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మరి కొందరికి ఉపాధి కల్పిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– నల్ల ప్రభాకర్
సత్ఫలితాలను ఇస్తున్న దళిత బంధు..
దారిద్య్రం నుంచి దళితులను దూరం చేసి, వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ ప్రయత్నం సత్ఫలితాలనిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. లబ్ధిదారులంతా ఒకే ఉపాధి మార్గాన్ని ఎన్నుకోకుండా తమకు నచ్చిన విధంగా, రాణించేలా దృష్టి సారించి సఫలీకృతులు అవుతున్నారు. దళితులు వారు ఉపాధి పొందడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించేలా చేయూతనివ్వడం సంతోషంగా ఉన్నది.
– ప్రవీణ్ రెడ్డి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లా