స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కళాజాత ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కళాకారులు పాడిన దేశభక్తి పాటలు స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపాయి. వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండుగగా సాగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలపై విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు స్థానికులను అలరించాయి. స్వాతంత్య్ర సాధనకు పోరాడిన మహనీయుల చరిత్రను కండ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు.
పరిగి/షాబాద్, ఆగస్టు 14 : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అట్టహాసంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా జాతీయ సమైక్యతను, స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతున్నారు.
ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు జాతీయ సమైక్యతను పెంపొందించేలా సాగాయి. అలాగే వివిధ పాఠశాలల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో సంప్రదాయ దుస్తుల్లో ఇచ్చిన ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో కళాకారులు చక్కటి పాటలతో నిర్వహించిన ప్రదర్శన స్థానికులను ఆకట్టుకున్నది. మువ్వన్నెల జెండా చేతబూని ప్రజలు, నాయకులు.. అధికారులు ఉత్సాహంగా కదిలివచ్చారు.