నవాబుపేట, ఫిబ్రవరి 15 : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు. ఆడపిల్ల పెండ్లి పేద కుటుంబానికి భారం కావొద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప మనసు సీఎం కేసీఆర్ది. ఈ పథకం ద్వారా నవాబుపేట మండలంలో 966 మందికి పైగా లబ్ధిపొందారు. పథకం ప్రారంభం నుంచి నేటి వరకు మండలంలో రూ.7,32,46,008 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీల యువతుల వివాహానికి రూ.51వేల ఆర్థికసాయం అందజేసింది. ఆ తర్వాత బీసీలకు వర్తింపజేశారు. 2017లో ఆర్థికసాయాన్ని రూ.75,116కు పెంచారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ 2018 మార్చి 19 నుంచి ఈ సాయాన్ని రూ.1,00,116కు పెంచారు. ప్రభుత్వంపై భారం పడినా ఆడబిడ్డల సంతోషమే తన సంతోషంగా పెండ్లి జరిగిన 15 రోజుల్లో వధువు తల్లిదండ్రులకు చెక్కు రూపంలో అర్థికసాయం అందజేస్తున్నా రు. పథకం అమలుపై నవాబుపేట మండలంలోని 32 గ్రామ పంచాయతీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దరఖాస్తులు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి చెక్కుల రూపంలో సాయం అందజేస్తున్నారు.
నియోజకవర్గంలో అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం అందేలా చూస్తున్నాం. ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించి అధికారులు నివేదిక సిద్ధం చేస్తారు. అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేస్తున్నాం. వీటిలో ఎలాంటి రాజకీయాలు, పైరవీలకు ఆస్కారం ఉండదు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి చేసే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి వారికి భరోసా ఇస్తున్నారు. – యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల
కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల తల్లితండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టి ఎంతో ధీమాను కల్పిస్తున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికసాయం అందింది. గతంలో పేదింటి ఆడపిల్ల పెండ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు అప్పులు చేసేవారు. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి.
– దయాకర్ రెడ్డి, అధ్యక్షుడు, ఎంపీటీసీల ఫోరం, నవాబుపేట మండలం
కల్యాణలక్ష్మి సాయం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుని మండల కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. లబ్ధిదారుల వివరాలు సేకరించి అర్హులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందజేస్తున్న సమయంలో ఆడబిడ్డల తల్లిదండ్రుల కండ్లలో ఎంతో సంతోషాన్ని చూశా. ఆ అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేను. ఆ కుటుంబాలు సీఎం కేసీఆర్కు జన్మాంతం రుణపడి ఉంటారు.
– భవాని, ఎంపీపీ, నవాబుపేట మండలం