వికారాబాద్, ఆగస్టు 1, (నమస్తే తెలంగాణ): ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో భారీగా తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది తహసీల్దార్లను జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో మూడేళ్లపాటు పనిచేస్తుండడంతోపాటు సొంత జిల్లా ప్రతిపాదికన బదిలీలు చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు బదిలీ చేశారు. అదేవిధంగా జిల్లాకు కేటాయించిన 17 మంది తహసీల్దార్లను రంగారెడ్డి, సంగారెడ్డి, జనగాం, మహబూబ్నగర్, యాదాద్రి, నారాయణపేట జిల్లాల నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారు. జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు నేడు లేదా రేపు ఆయా మండలాలకు తాసీల్దార్లుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కేటాయించనున్నారు.
జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తాసీల్దార్లను బదిలీ చేశారు. మోమిన్పేట్ తాసీల్దార్గా పనిచేస్తున్న కిరణ్కుమార్, తాండూరు తహసీల్దార్గా పనిచేస్తున్న చిన్నప్పల నాయుడును రంగారెడ్డి జిల్లాకు, దౌల్తాబాద్ మండల తాసీల్దార్గా పనిచేస్తున్న కృష్ణయ్య, దుద్యాల తహసీల్దార్గా పనిచేస్తున్న భీమయ్యను, చౌడాపూర్ మండల తాసీల్దార్గా పనిచేస్తున్న అశోక్కుమార్, కొడంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్న బుచ్చయ్యను హైదరాబాద్ జిల్లాకు, మర్పల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీధర్ను నల్లగొండ జిల్లాకు, పెద్దేముల్ తహసీల్దార్గా పనిచేస్తున్న విద్యాసాగర్ రెడ్డిని, బంట్వారం తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని మహబూబ్నగర్ జిల్లాకు, కోట్పల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న అష్పక్ రసూల్ను, దోమ తహసీల్దార్గా పనిచేస్తున్న షాహేదాబేగాన్ని, ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న వాహెదాఖతూమ్ను గద్వాల జిల్లాకు, నవాబుపేట్ తహసీల్దార్ను రవీందర్, యాలాల తహసీల్దార్ గోవిందమ్మను, రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న సుధాశెట్టిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు బదిలీ చేశారు.
జిల్లాకు ఇతర జిల్లాల నుంచి 17 మంది తాసీల్దార్లు బదిలీపై వచ్చారు.నారాయణపేట జిల్లా నుంచి దానయ్య, యాదాద్రి జిల్లా నుంచి డి.గణేశ్, సంగారెడ్డి జిల్లా నుంచి మనోహర్ చక్రవర్తి, రమాదేవి, ప్రవీణ్కుమార్, మురళీధర్, కె.కిషన్, బి.ప్రభు, బి.జయరాం, కెతావత్ తారాసింగ్, కె.పద్మావతి, బి.విజయకుమార్, సి.విజయ్కుమార్, ఆశాజ్యోతిలను, మహబూబ్నగర్ జిల్లా నుంచి బి.లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా నుంచి కె.రాములు, జనగాం జిల్లా నుంచి వి.గంగాభవానీలను జిల్లాకు బదిలీపై వచ్చారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1 : రంగారెడ్డిజిల్లాలో పనిచేస్తున్న 20మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేండ్ల పాటుగా రంగారెడ్డిజిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను ఎన్నికల నియమావలి దృష్ట్యా వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. గత మూడేండ్లుగా వీరు రంగారెడ్డిజిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడేండ్లు పైబడిన తహసీల్దార్లందరినీ హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సూర్యాపేట్ జిల్లాలకు బదిలీ చేశారు. ఆయా జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు.