ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చింది. ఇకపై ఈ యాప్ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదును చేపట్టనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1,338 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 1.65లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ట్యాబ్లలో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ జరుగుతుండగా.. త్వరలోనే ఎఫ్ఆర్ఎస్ సిస్టం ద్వారా హాజరు ప్రక్రియను చేపట్టనున్నారు. దీంతో విద్యార్థులు హాజరుశాతం పెరుగడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం బిల్లుల విషయంలో అవకతవకలకు అడ్డుకట్ట పడనున్నది.
రానున్న రోజుల్లో టీచర్ల హాజరును సైతం ఇదే విధానంలో చేపట్టనున్నారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక ట్యాబ్ను, అంతకంటే ఎక్కువ మంది ఉంటే రెండు ట్యాబ్లను అందజేసింది. ఈ ట్యాబ్లలో విద్యార్థుల వివరాలతోపాటు ఐరిస్ను నిక్షిప్తం చేసే ప్రక్రియను ఉపాధ్యాయులు వేగవంతంగా చేస్తున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 13
బషీరాబాద్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చిత్రపటానికి
క్షీరాభిషేకం చేస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థుల నమోదులో స్పష్టత కోసం, మధ్యాహ్న భోజన పథకం బిల్లుల విషయంలోనూ అవకతవకలు జరుగకుండా ఉండేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఇకపై విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా చేపట్టనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,338 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో 1.65లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ట్యాబ్లలో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. త్వరలోనే ఎఫ్ఆర్ఎస్ సిస్టం ద్వారా హాజరు ప్రక్రియను చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో టీచర్ల హాజరు కూడా ఇదే విధానం కొనసాగనుంది.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలను చేపట్టింది. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. పుస్తకాలు మొదలుకుని ఫీజుల దాకా తల్లిదండ్రులపై భారం పడకుండా.. విద్యార్థులు బడికి వెళ్లి చక్కగా చదువుకునేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నది. అయితే విద్యార్థుల హాజరులో ఖచ్చితత్వం లేకపోవడం.. చాలా పాఠశాలల్లో ఈ పద్ధతి అయోమయంగా ఉన్నది. ఫలితంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్కాలర్షిప్ వంటివి ఎంత మందికి అందించారనే విషయంలోనూ స్పష్టత ఉండడంలేదు. గైర్హాజరు అయిన విద్యార్థుల పేరుతో ప్రయాణ భత్యం, స్కాలర్షిప్పుల బిల్లులను అక్రమంగా డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం పథకంలోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎఫ్ఆర్ఎస్ యాప్తో ఇకపై ఈ తరహా అవకతవకలకు చెక్ పడడంతోపాటు హాజరు శాతం సైతం మెరుగుపడనుంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడం ద్వారా ప్రభుత్వం ఆశించిన స్థాయంలో నూరు శాతం ఫలితాలను రాబట్టవచ్చని విద్యాశాఖ భావిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ, మోడల్ తదితర పాఠశాలలు 1,338 వరకు ఉన్నాయి. వీటిల్లో 1.65 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా..ప్రస్తుతం హాజరు పట్టికలో విద్యార్థుల అటెండెన్స్ను నమోదు చేసి ఆతర్వాత ఆన్లైన్లో నమోదు చేస్తూ వస్తున్నారు. ఇకపై ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రకారం పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక ట్యాబ్ను, అంతకంటే ఎక్కువ మంది ఉంటే రెండు ట్యాబ్లను అందజేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ట్యాబ్లలో విద్యార్థుల వివరాలతోపాటు ఐరిస్ను నిక్షిప్తం చేస్తున్నారు. ఐరిస్ విధానం వల్ల తరగతి గదిలోని విద్యార్థులందరి హాజరును ఒకేసారి తీసుకునే అవకాశం కలుగనున్నది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు క్షణాల్లో విద్యార్థుల హాజరు శాతం తెలిసిపోతుంది. త్వరలోనే ఈ సిస్టంను ఉపాధ్యాయుల హాజరులోనూ వర్తింపజేయనున్నారు. ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ జిల్లాలో అది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరు నమోదును చేపట్టడం వల్ల పారదర్శకత పెరుగనుంది.
– సుశీందర్రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ ఫేషియల్ యాప్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం యాప్లో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ జరుగుతున్నది. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం. హాజరు ప్రకారమే మధ్యాహ్న భోజనం బిల్లులు, స్కాలర్షిప్పులు తదితర వాటిని అందించనున్నాం. ఈ విధానంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగనుంది.
– రాజిరెడ్డి, ఉపాధ్యాయుడు, నోముల యూపీఎస్ ప్రభుత్వ పాఠశాల
విద్యార్థుల హాజరులో పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ తీసుకొచ్చిన ఫేషియల్ విధానాన్ని స్వాగతిస్తున్నాం. కొంతమంది చేస్తున్న తప్పులకు విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నది. ఇకపై విద్యార్థుల హాజరు లెక్క పక్కాగా ఉండడంతో అవకతవకలకు చెక్ పడనుంది. ప్రభుత్వం అందించే పథకాల అమలులోనూ పారదర్శకత వస్తుంది. హాజరు శాతం పెరిగి విద్యార్థుల చదువులు సైతం మెరుగుపడనున్నాయి.