తాండూరు : తాండూరు పట్టణంతో పాటు నియోజక వర్గంలో పాడైన ఆర్అండ్బీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభించి ఆరు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. తాండూరు అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో శనివారం తాండూరు బంద్ చేసి రోడ్లు, కాలుష్యం గురించి ధర్నా చేపట్టడంతో స్పందించిన ఎమ్మెల్యే సంఘటన స్థలంకు చేరుకొని అందోళన కారులతో మాట్లాడారు. తాండూరు అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామని, ప్రత్యేక నిధులు కూడా తీసుకు రావడం జరిగిందని తెలిపారు.
పాడైన రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవమేనని అందుకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తయ్యే వరకు తాండూరు పట్టణంలో దుమ్ము లేవకుండా రోజు రోడ్లపై నీళ్లు చల్లిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ఓర్వలేని కొందరు కావాలని లేనిపోని కార్యక్రమాలు చేసి కుట్రలు పన్నుతున్నారని వాటిని ప్రజలు నమ్మరాదని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.
కళాశాలలో సమస్యలను పరిష్కరిస్తాం..
2500మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో గదులు, అధ్యాపకులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు శనివారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి విద్యార్థులు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే విద్యా శాఖ మంత్రి సబితారెడ్డికి ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా చక్కగా చదువుకోవాలని అన్నారు.
అనంతరం ఎన్నో ఎళ్లుగా మూతపడిన తాండూరులోని పాల శితలీకరణ కేంద్రన్ని పరిశీలించారు. త్వరలో పాల కేంద్రం పునర్ ప్రారంభం కానుండటంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపనర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.