తాండూరు : తాండూరు నియోజకవర్గంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లను బాగు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు-తొర్మామిడి- ఆత్కూరు రోడ్ల పనులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేగంగా నాణ్యతతో రోడ్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలం నుంచి గ్రామాలకు వెల్లె ప్రతి రోడ్డును యుద్ధ ప్రాతిపదికన బాగు చేస్తామన్నారు.
అందుకు కావాల్సిన నిధులకు సంబంధిత శాఖ మంత్రులు, సీఎం కేసీఆర్తో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాండూరు-తొర్మామిడి రోడ్డు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. తాండూరు ఔటర్ రింగ్రోడ్డును కూడా త్వరగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.