తాండూరు, ఏప్రిల్ 9: తాండూరు నియోజకవర్గంలో ప్రజలు మంగళవారం ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పల్లెల్లో ప్రత్యేకమైన ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి, తీపి వంటకాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన అనంతరం కుటుంబంతో పాటు బంధుమిత్రులు కలిసి పచ్చడి తాగి తీపి వంటకాలను ఆరగించారు. రైతులు తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా పొలాల్లో పూజలు చేసి దుక్కులు దున్నడాన్ని ప్రారంభించారు. తాండూరు శ్రీభావిగి భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి ఆలయం, పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, కట్టమైసమ్మ దేవాలయం, భవానీమాత దేవాలయం, కోకట్ రోడ్డు మార్గంలోని సాయిబాబా దేవాలయంతో పాటు నియోజకవర్గంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయాల్ల్లో వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. ప్రజలకు షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. తాండూరు పట్టణంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8 వ తేదీ వరకు జరుగనున్న శ్రీభావిగి భద్రేశ్వరస్వామి జాతరకు మంగళవారం అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సావాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవ చక్రాలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, దేవస్థానం కార్యనిర్వహణ అధికారులు, ఆల యకమిటీ ప్రతినిధులతో పాటు తాండూరు పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
పరిగి: పరిగి పట్టణంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, బహార్పేట్ హనుమాన్ మందిర్లో మాజీ సర్పంచ్ సిద్దాంతి పార్థసారథి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వివిధ రాశుల వారికి కలిగే శుభాలను వివరించారు. పరిగిలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ పఠనంలో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఆయా గ్రామాలపెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బొంరాస్పేట: క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మంగళవారం బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ప్రజలు కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బొంరాస్పేటలో పురోహితుడు జోషి శ్రీనివాస్రావు పంచాంగ పఠనం చేశారు. కొత్త ఏడాదిలో రాశి ఫలాలు, వర్షాకాలం ఎలా ఉంటుందో ఆయన వివరించారు. అనంతరం పచ్చడి పంపిణీ చేశారు. నూతన సంవత్సరం కావడంతో ప్రజలు కొత్తగా ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దుద్యాలలో యువకులు అడుగుల భజన, జడకొప్పు ఆటను ప్రదర్శించారు. పలు గ్రామాల్లో ఆటల పోటీలు నిర్వహించారు.
వికారాబాద్: గ్రామాల్లోని హనుమాన్ దేవాలయం, శివాలయాలు, శ్రీ రామ మందిరంలో పంచాంగాన్ని ఆలయ అర్చకులు వినిపించారు. ఆలయాల్లో అన్ని రాశుల వారికి జరుగబోయే విషయాలు వివరించారు. అనంతరం ఆల యంలో భక్తులు పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పచ్చడిని పంపిణీ చేశారు.
కులకచర్ల : కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఉగాది పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్ గ్రా మంలో పురో హితుడు మఠం రాజశేఖర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.