తాండూరు : తాండూరులో అతిసార వ్యాధి ఒక్కసారిగా పంజా విసిరింది. గురువారం జిల్లా ఆస్పత్రిలో దాదాపు యాభైకి పైగా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో 26మందికి అతిసార సోకగా యాలాల, పెద్దేముల్ మండలాల నుంచి 24మందికి అతిసార వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వీరందరూ తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణితో పాటు పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు జిల్లా ఆస్పత్రికి చేరుకొని రోగులను పరమర్శించారు.
ప్రజలు త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఎక్కడైతే ఎక్కువగా అతిసార కేసులు నమోదయ్యాయే ఆ ప్రాంతంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా చాల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.