తాండూరు, అక్టోబర్ 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఇంటింటికీ చేరుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. గురువారం గొట్లపల్లి గేటు సమీపంలో తాండూరు (మున్సిపల్) పట్టణం బీఆర్ ఎస్ ఎన్నికల శంఖారావం సభను నిర్వహించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పరిధిలోని 36 వార్డుల నుంచి వేలాది సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. తాండూరు పట్టణానికి చెందిన షహజాది బేగం ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ఆశీర్వదిస్తూ ఎన్నికల ఖర్చుకోసం అభిమానంతో పెన్షన్ డబ్బులను విరాళంగా అందజేసీ బీఆర్ఎస్పై ఉన్న మక్కువను చాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లా డుతూ ప్రాణాలు లెక్కచేయకుండా కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. తాండూరు పక్కనే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు లేవ న్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్తోనే భారతదేశం అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమన్నారు. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు.
రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. తాండూరు పట్టణ అభివృద్ధి పనులకు రూ.1191.86 కోట్లు, తాండూరు మండలంలో అభివృద్ధి పనులకు రూ.236.14 కోట్లు, యాలాల మండలం లో అభివృద్ధి పనులకు రూ. 97.77 కోట్లు, బషీరాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు రూ. 68.18 కోట్లు, పెద్దేముల్ మండలం అభివృద్ధి పనులకు రూ.78.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ‘కారు’ గుర్తుకు ఓటు వేసి మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే అందరూ గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్ మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్రను సృష్టిస్తారని పేర్కొన్నారు.
వడ్ల కల్లాలప్పుడు అడుక్కుతినే వాళ్లలా.. ఎన్నికలు రాగానే కొందరు కొత్త బిచ్చాగాళ్లు తాండూరుకు ఓట్ల కోసం వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్, బీజేపీ మాటలు ప్రజలు నమ్మరాదని సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరుణం పురుషోత్తం రావు, పి.శ్రీశైల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ను తట్టు కొని నిలబడే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణ, వైస్ చైర్మన్ ఉమాశంకర్, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు నర్సిం హులు, శ్రీనివాస్చారి, సంతోష్గౌడ్, బీఆర్ఎస్ మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, ఫ్లోర్లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.