తాండూరు : జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు శనివారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో మహాత్మగాంధీ విగ్రహానికి, చిత్రపటాలకు పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. తాండూరు పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నేతలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ శాంతియుత మార్గంలో పోరాటం చేసి స్వాతంత్ర్యన్ని తీసుకువచ్చారన్నారు. అహింస, త్యాగం, సత్యాలకు మారు పేరే మహాత్మాగాంధీజీని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నేటితరం నడుచుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం టీఆర్ఎస్ పాలనలో అమలవుతుందన్నారు. అదే విధంగా మార్వడీ యువమంచ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం మహాదానమని, రక్తదానం ఇవ్వడంతో ఆరిపోతున్న మరో జీవి ప్రాణాన్ని కాపాడగలమని ప్రజాప్రతినిధులు, రక్తదాన నిర్వాహకులు పేర్కొన్నారు.