కుష్టువ్యాధి కట్టడికి వైద్యారోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మంగళవారం నుంచి వికారాబాద్ జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నది. ఈ నెల 20వ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల ఉద్యమం(ఎల్సీడీసీ) పేరుతో నిత్యం 20 ఇండ్లకుపైగా సర్వే చేసి వివరాలను సేకరించనున్నారు. ఇందుకు జిల్లాలోని 25 పీహెచ్సీల పరిధిలోని 720 మంది ఆశ కార్యకర్తలు పని చేయనున్నారు. ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వారికి 15 రోజులపాటు సమీప వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్స, మందులను పంపిణీ చేయనున్నారు. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందని, లేదంటే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
– బొంరాస్పేట, డిసెంబర్ 4
బొంరాస్పేట, డిసెంబర్ 4 : లెప్రసీ నిర్మూలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. రోగులను ముందుగా గుర్తించి వారికి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా అనుమానితులను గుర్తించడానికి లెప్రసీ కేస్ డిటెక్షన్ కంపైన్ (ఎల్సీడీసీ) పేరుతో డిసెంబర్ 6 నుంచి 20 వరకు ఇంటింటికీ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో కేవలం లెప్రసీ అనుమానితుల వివరాలు మాత్రమే సేకరిస్తారు.
కరోనాతో రెండేండ్లుగా చేయని సర్వే
కరోనా కారణంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి నిర్వహించే సర్వే రెండేండ్ల నుంచి చేపట్టకపోవడంతో రోగులు ఎంతమంది ఉన్నారో లెక్క తేలడం లేదు. ఈసారి మాత్రం సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తుల లెక్కా పక్కాగా తేల్చడానికి అధికారులు నిర్ణయించారు. వ్యాధితో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నవారి వివరాలను కూడా సేకరిస్తారు. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 93 మంది లెప్రసీ బాధితులున్నారు.
ఇవీ వ్యాధి లక్షణాలు, చికిత్స
చర్మంపై గోధుమ రంగులో మొద్దుబారిన, స్పర్శ లేని మచ్చలు ఏర్పడుతాయి. తిమ్మిరితో కూడిన మచ్చలు, పాలిపోయిన మచ్చలు ఉంటాయి. ఇవి కనిపిస్తే ప్రాథమిక లక్షణాలుగా గుర్తించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెఫర్ చేయాలని వైద్యాధికారులు సూచించారు. 1 నుంచి 5 లోపు మచ్చలు కనిపిస్తే వారికి ఆరు నెలలు, 5 కంటే ఎక్కువ మచ్చలు గుర్తిస్తే వారికి ఏడాది పాటు చికిత్స అందిస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రతి రోజూ రెండు టాబ్లెట్లు వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
సర్వేలో పాల్గొననున్న 720 మంది ఆశా కార్యకర్తలు
లెప్రసీ అనుమానితులను గుర్తించడానికి 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో ఆశా కార్యకర్తలు పాల్గొంటారు. పది మంది ఆశాలకు ఒకరు పర్యవేక్షకులుగా ఉంటారు. సర్వేకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలో 25 పీహెచ్సీలు ఉండగా 720 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. వీరు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 20 ఇండ్లకు వెళ్లి సర్వే వివరాలు సేకరించాలి. ప్రాథమిక లక్షణాలు గుర్తించిన వారికి 15 రోజులపాటు సమీప వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ఉన్నట్లు తేలితే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటారు. సమాజంలో భయపడి వ్యాధి లక్షణాలను దాచరాదని.. ఏమాత్రం అనుమానం ఉన్నా సర్వే సిబ్బందికి తెలియజేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని, లేకుండా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పూర్తిగా నయమవుతుంది : డాక్టర్ రవీంద్ర యాదవ్, వికారాబాద్ జిల్లా లెప్రసీ ప్రోగ్రాం అధికారి
లెప్రసీని ప్రారంభంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. లేకుంటే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. చిన్న మచ్చలే నొప్పి లేదు కదా అని వాటిని నిర్లక్ష్యం చేయరాదు. ఇంటింటికీ వచ్చే ఆశా కార్యకర్తలకు అనుమానం ఉన్న ప్రతిఒక్కరూ తమ వివరాలను తెలియజేయాలి. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందించి నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. సర్వేకు అందరూ సహకరించాలి.