షాబాద్, ఆగస్టు 4 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి రోజు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లతో పాటు, విద్యార్థుల హాజరు, స్టాకు వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్లను పక్కదారి పట్టించకుండా ముద్రలు వేసి కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహా రం అందించేందుకు ప్రభుత్వం కోడిగుడ్లు, పాలు అందిస్తున్నది. అంగన్వాడీ టీచర్లు కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించాకే తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 27 మండలాల పరిధిలోని ఏడు ఐసీడీఏస్ ప్రాజెక్టులు చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, ఆమనగల్లు, శేరిలింగంపల్లి, మహేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,380 పెద్ద అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 220 మినీ కేంద్రాలతో కలిపి 1,600 కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 15,209 మంది గర్భిణులు, 13,435 మంది బాలింతలు, 1,45,118 మంది చిన్నారులున్నారు. వీరందరికీ ప్రతి నెల అందించే కోడిగుడ్లపై ముద్ర వేసి పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి ఆ ముద్ర ఉన్న కోడిగుడ్లు బయట కనిపించకుండా, పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. సంబంధిత ఐసీడీఎస్ అధికారులు కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,600 అంగన్వాడీ కేంద్రాలకు ముద్ర వేసిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాం. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో మరింత పారదర్శకత పెరిగింది. ఇప్పటికే కేంద్రాల్లో ఆన్లైన్ సేవలు అందుతున్న తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం ముద్రలు వేసిన గుడ్లు సరఫరా చేస్తుండడంతో లబ్ధిదారులకు సకాలంలో కోడిగుడ్లు చేరనున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 15,209 మంది గర్భిణులు, 13,435 మంది బాలింతలు, 1,45,118 చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– పద్మజారమణ, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి