Summer | షాబాద్, ఫిబ్రవరి 18: వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నయ్. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో ఆదివారం గరిష్ఠంగా 37.1 డిగ్రీలు కనిష్ఠం 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగ మండుతుండడంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా, జనం కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రతలు 30-37 డిగ్రీలకు వరకు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు ఫిబ్రవరి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగుతున్నాయి. వారం క్రితం తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతున్నది. రోడ్లపైన జనాలు కనిపించడం లేదు. పెండ్లిళ్ల సీజన్ కావడంతో టవల్, చేతి రుమాల్, టోపీలు, గొడుగులను ధరించి కనపడుతున్నారు.
ఇప్పుడే ఎండల తీవ్రత ఇంతస్థాయిలో ఉంటే… మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి ఎక్కువగా కొబ్బరి బొండాలు, నిమ్మకాయ పానీయాలు, లస్సీలు, పండ్ల రసాలు తాగుతున్నారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పాటు రోహిణి కార్తె ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం వేరు, రానున్న కాలంలో పరిస్థితులు వేరుగా ఉండనున్నాయి. రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. ప్రతిరోజూ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వైరల్ జ్వరాలు పెరిగాయి. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో చాలా మంది బాధపడుతున్నారు. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకువెళ్లాలని చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగాఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. మరోమూడు నెలలు ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని, వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు, ప్రజలు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.